
సాధారణంగా శరీరంలోకి చిన్న నలుసు వెళ్లినా మనం విలవిలలాడిపోతాం. కానీ చైనాకు చెందిన ఒక వ్యక్తి ఏకంగా ఒక పాదరస థర్మామీటర్ను 20 ఏళ్ల పాటు తన కడుపులోనే మోశాడు. వినడానికి నమ్మశక్యం కాకపోయినా, వైద్య పరీక్షల్లో తేలిన ఈ నిజం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చైనాలోని వెన్జౌ ప్రాంతానికి చెందిన 32 ఏళ్ల వాంగ్, తీవ్రమైన కడుపునొప్పితో ఆసుపత్రిలో చేరాడు. వైద్యులు స్కానింగ్ చేయగా అతని చిన్న పేగులోని డుయోడెనమ్ భాగంలో ఒక వింత వస్తువు ఇరుక్కుపోయి ఉన్నట్లు గమనించారు. తీరా అది ఏంటా అని ఆరా తీస్తే.. అది ఒక పాదరస థర్మామీటర్ అని తేలింది.
వాంగ్ను విచారించగా.. తను 12 ఏళ్ల వయసులో ప్రమాదవశాత్తు దానిని మింగేశానని, భయం వల్ల ఆ విషయాన్ని ఎవరికీ చెప్పలేదని వెల్లడించాడు. వైద్యులు కేవలం 20 నిమిషాల వ్యవధిలో అత్యంత క్లిష్టమైన సర్జరీ చేసి ఆ థర్మామీటర్ను బయటకు తీశారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. 20 ఏళ్లు లోపలే ఉన్నా ఆ థర్మామీటర్ పగలలేదు. ఒకవేళ అది పగిలి ఉంటే, అందులోని విషపూరితమైన పాదరసం ప్రాణాలకే ముప్పు తెచ్చి ఉండేదని వైద్యులు తెలిపారు.
ఇదే తరహాలో మరో దిగ్భ్రాంతికరమైన ఘటన 64 ఏళ్ల వృద్ధుడి విషయంలో జరిగింది. దాదాపు 52 ఏళ్ల క్రితం అతను పొరపాటున మింగిన 17 సెంటీమీటర్ల పొడవున్న టూత్ బ్రష్, 2024 జూన్లో శస్త్రచికిత్స ద్వారా బయటపడింది. ఐదు దశాబ్దాల పాటు కడుపులో అంత పెద్ద వస్తువు ఉన్నా, పెద్దగా ఇబ్బంది కలగకపోవడం వైద్య చరిత్రలోనే ఒక అద్భుతమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వెన్జౌ డైలీ నివేదిక ప్రకారం.. చైనాలో ఏటా 10 లక్షల మందికి పైగా ప్రజలు ఇలాంటి ‘ఫారిన్ ఆబ్జెక్ట్స్’ (బయటి వస్తువులు) మింగి ఆసుపత్రి పాలవుతున్నారు. ఇందులో 60 శాతం కంటే ఎక్కువ మంది చిన్న పిల్లలే ఉండటం ఆందోళన కలిగించే విషయం. చేపల ముళ్లు, బ్యాటరీలు, నాణేలు మరియు కట్టుడు పళ్ళు వంటివి మింగడం వల్ల తీవ్రమైన అంతర్గత రక్తస్రావం జరిగే ప్రమాదం ఉంది.