
జార్ఖండ్లోని పశ్చిమ సింగ్భూమ్లోని బరంగ గ్రామంలో గణిత ఉపాధ్యాయుడు గుల్షన్ లోహర్ ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాడు. ఎందుకంటే గుల్షన్ కు పుట్టుకతోనే చేతులు లేవు. అయినా సరే చదువుమీద ఉన్న ఆసక్తితో తన పాదాలను ఉపయోగించి రాయడం నేర్చుకున్నాడు. ఇప్పుడు టీచర్ గా చాక్బోర్డులపై నైపుణ్యంగా లెక్కలు చెబుతూ.. మంచి స్టూడెంట్స్ కు సమాజానికి అందిస్తున్నాడు. ఇలా టీచర్ వృత్తిని చేపట్టి 11 సంవత్సరాలు అయినట్లు తెలుస్తోంది. గుల్షన్ లోహర్ పట్టుదల, కరుణ అతని అటవీ సమాజంలో ఒక మార్గదర్శిగా నిలిచాడు. తల్లిదండ్రులు, విద్యార్థులు, విద్యా అధికారుల నుంచి ప్రశంసలను అందుకున్నాడు. ఇప్పుడు విద్యా వ్యవస్థలో ఇటువంటి స్ఫూర్తిదాయకమైన మార్పులను సృష్టించేవారికి మరింత మద్దతు ఇవ్వాలని కోరుతున్నాడు.
చేతులేని గుల్షన్ లోహర్ చిన్నతనం నుంచే కష్టాలను దృఢ సంకల్పంతో ఎదుర్కొన్నాడు. చేతులు లేకుండా జన్మించిన అతను తన పాదాలతో రాయడంలో ప్రావీణ్యం సంపాదించాడు. చదువులో రాణించాడు, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీని పూర్తి చేశాడు. తోటి స్టూడెంట్స్ కంటే చదువులో ముందు ఉండేవాడు. చదవు కోవడానికే కాదు.. చదువు చెప్పడానికి వైకల్యం అడ్డురాదని నిపించాలని భావించాడు. తన తల్లి, సోదరుడి అండగా టీచర్ గా వృత్తిని చేపట్టాడు. ఇప్పుడు తన తల్లి, సోదరుడు, భార్య అంజలి , చిన్న కుమార్తెల మద్దతుతో గుల్షన్ తన దృష్టిని సేవలోకి మళ్లించాడు. మారుమూల, అట్టడుగు ప్రాంతాలలో పిల్లలు చదువుకునే విధంగా ప్రయత్నం చేస్తున్నాడు.
కాళ్ళతో బోధించడం
ప్రతిరోజు గుల్షన్ తన తరగతి గదిలోకి ఒక స్ఫూర్తితో ప్రవేశిస్తాడు. తన కాలి వేళ్ళ మధ్య సుద్దను పట్టుకుని బ్లాక్బోర్డ్పై గణితాన్ని బోధిస్తాడు. విద్యార్థులకు ఓపికగా లెక్కలు చేసే విధానాన్ని వివరిస్తాడు. తల్లిదండ్రులు అతన్ని మార్గదర్శక శక్తిగా పిలుస్తారు. గుల్షన్ గురించి స్కూల్ ప్రిన్సిపాల్ మాట్లాడుతూ.. కృషి పట్టుదల ఉంటే ఎటువంటి కలను అయినా సాధించవచ్చు అని మన పిల్లలకు చూపించాడు అని చెబుతున్నారు. గుల్షన్ కు సంబంధించిన స్పూర్తి వంతమైన కథ నేడు భారత దేశం అంతటా వినిపిస్తోంది.
బరంగ గ్రామం దట్టమైన సారండ అడవిలో ఉంది. ఈ ప్రాంతం చాలా కాలంగా అశాంతి, మౌలిక సదుపాయాల లేమితో ఉంది. ఇక్కడ చదువుకోవడం అంటే ఒక సవాలు. ప్రాథమిక సౌకర్యాలు చాలా తక్కువగా ఉన్నాయి. అటువంటి పరిస్థితుల మధ్య గుల్షన్ తన చదువును కొనసాగించడానికి శ్రేయోభిలాషుల నుంచి అప్పు తీసుకున్నాడు, దుమ్ముతో నిండిన మార్గాల్లో కిలోమీటర్లు ప్రయాణించాడు. బి.ఎడ్ పూర్తి చేయడానికి ముఖ్యమంత్రి నుంచి గ్రాంట్ పొందాడు. అతను ప్రస్తుతం ఉపాధ్యాయ అర్హత పరీక్షకు సిద్ధమవుతున్నాడు. తన కుటుంబం పోషించడానికి, స్టూడెంట్స్ కు మంచి చదువు చెప్పేందుకు తన పదవిని అధికారికంగా క్రమబద్ధీకరించాలని కోరుతున్నాడు.
స్థానిక విద్యా అధికారులు గుల్షన్ కి సహాయం చేస్తామని హామీ ఇచ్చారు: “గుల్షన్ వంటి ఉపాధ్యాయులను గుర్తించి మద్దతు ఇవ్వడానికి మేము కట్టుబడి ఉన్నాము.. తద్వారా సమ్మిళిత విద్య మినహాయింపు కాదు, ఒక ప్రమాణంగా మారుతుందని చెప్పారు. గుల్షన్ ఇంటి దగ్గర ఆర్థికంగా వెనుకబడిన పిల్లలకు ఉచితంగా చదువు చెబుతాడు.
గుల్షన్ టీచర్ మాత్రమే కాదు రచయిత కూడా. ఇతని రచనలకు జాతీయ స్థాయిలో వచ్చిన కవరేజ్ తో ప్రేరణ పొందిన జార్ఖండ్ ప్రభుత్వం ఇప్పుడు వైకల్యం ఉన్న విద్యావేత్తలను గుర్తించి వారికి బహుమతులు ఇచ్చే విధానాలను సమీక్షిస్తోంది. పశ్చిమ సింగ్భూమ్లోని అధికారులు ఇలాంటి సవాళ్లను ఎదుర్కొంటున్న ఉపాధ్యాయులకు కొత్త స్కాలర్షిప్ పథకాలను, శిక్షణకు మెరుగైన ప్రాప్యతను ప్రకటించింది. గుల్షన్ లోహార్ అద్భుతమైన ప్రయాణం నేటి సమాజానికి ఒక మంచి స్పూర్తి. ఎందుకంటే అన్నీ ఉన్నవారే .. చిన్న చిన్న కారణాలతోనే నిరాసనిసృహకు గురవుతున్నారు.
మరిన్ని లైఫ్ స్టైల్ స్టోరీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..