
రద్దీగా ఉండే ఎయిర్పోర్ట్లో ఓ ప్రయాణికుడు మాత్రం కాస్త అనుమానాస్పదంగా కనిపించాడు. వెంటనే అధికారులు అతన్ని ఆపి, అతని లగేజీని మొత్తం చెక్ చేయాలని డిసైడ్ అయ్యారు. కస్టమ్స్ అధికారులు అతన్ని ఆపిన వెంటనే అతనిలో భయం మరింత ఎక్కువైంది. దెబ్బకు చెమలు పట్టేశాయి. దీంతో కస్టమ్స్ అధికారులకు అనుమానం మరింత ఎక్కువైంది. ఇక ఆలస్యం చేయకుండా అతని బ్యాగ్ తెరిచారు.. అంతే దెబ్బకు ఉలిక్కిపడ్డారు. ఎందుకంటే ఆ బ్యాగ్లో ఏకంగా 304 ప్రాణాలు కొట్టుమిట్టాడుతున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
కాయోసింగ్ కస్టమ్స్ వెల్లడించిన వివరాల ప్రకారం.. హ్సింగ్ అనే ప్రయాణికుడు “స్మాల్ త్రీ లింక్స్” మార్గం ద్వారా జంతువులను అక్రమంగా తరలించేందుకు ప్రయత్నించాడు. బుధవారం తైవాన్ ఎయిర్పోర్ట్లో ఫెర్రీ టెర్మినల్లో నిర్వహించిన తనిఖీల్లో అధికారులు అతడి లగేజీలో దాచిపెట్టిన జంతువులను గుర్తించారు. అనంతరం అతడిపై వన్యప్రాణుల సంరక్షణ చట్టంతో పాటు పలు ఇతర నిబంధనల కింద కేసులు నమోదు చేసి విచారణ కోసం సంబంధిత అధికారులకు అప్పగించారు. స్వాధీనం చేసుకున్న జంతువుల్లో 208 గెక్కోలు, ఐదు స్టాగ్ బీటిల్స్, 79 అనుమానిత పిల్ బగ్స్, 12 రైనోసెరోస్ బీటిల్స్ ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇటీవల కిన్మెన్లోని “స్మాల్ త్రీ లింక్స్” ఫెర్రీ టెర్మినల్ వద్ద ఇలాంటి అక్రమ రవాణా ప్రయత్నాలు పెరిగినట్లు కస్టమ్స్ పేర్కొంది. కేవలం రెండు రోజుల క్రితమే మరో ప్రయాణికుడు సుమారు 304 సజీవ బల్లులను అక్రమంగా తరలించే ప్రయత్నంలో పట్టుబడ్డాడు.
సజీవ జంతువులను అనుమతి లేకుండా దేశంలోకి తీసుకురావడం వన్యప్రాణి సంరక్షణ చట్టం, అంటు జంతు వ్యాధుల నివారణ మరియు నియంత్రణ చట్టం, కస్టమ్స్ స్మగ్లింగ్ నిరోధక చట్టాలను ఉల్లంఘించినట్లేనని అధికారులు స్పష్టం చేశారు. స్వాధీనం చేసుకున్న జంతువులను జప్తు చేసి, పరిస్థితిని బట్టి వాటిని నాశనం చేయడం లేదా సంరక్షణ కోసం అటవీ, ప్రకృతి పరిరక్షణ సంస్థకు అప్పగించడం జరుగుతుందని తెలిపారు. ఈ తరహా అక్రమ రవాణా పర్యావరణ సమతుల్యతను దెబ్బతీయడమే కాకుండా, విదేశీ జీవజాతులు స్థానిక జీవవ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా అడవి జంతువులు బ్యాక్టీరియా, వైరస్లు, పరాన్నజీవులను మోసుకురావడం వల్ల ప్రజారోగ్యానికి, పశుసంపద పరిశ్రమకు, జీవ భద్రతకు ముప్పు ఏర్పడే అవకాశం ఉందని కస్టమ్స్ అధికారులు తెలిపారు. చట్టాలను ఉల్లంఘించిన వారికి గరిష్ఠంగా ఏడేళ్ల జైలు శిక్షతో పాటు 30 లక్షల తైవాన్ డాలర్ల వరకు జరిమానా విధించే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. ప్రజలు తమ వద్ద ఉన్న వస్తువులను కచ్చితంగా ప్రకటించాలని, సందేహాలు ఉంటే ముందుగానే కస్టమ్స్ అధికారులను సంప్రదించాలని సూచించారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి