
అదృష్టం ఎప్పుడు, ఎవరిని, ఎలా వరిస్తుందో ఎవరూ చెప్పలేరు. కేరళలో జరిగిన ఒక వింత సంఘటన ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. రోడ్డు మీద పడి ఉన్న ఒక లాటరీ టికెట్ ఒక వ్యక్తి తలరాతను మార్చేసింది. అది తనను కోటీశ్వరుడిని చేస్తుందని ఆ వ్యక్తి కలలో కూడా ఊహించలేదు. కేరళలో ఈ ఏడాది జనవరిలో క్రిస్మస్ బంపర్ లాటరీ ఫలితాలు ప్రకటించారు. ఇందులో మొదటి బహుమతి ఏకంగా రూ.20 కోట్లు. అయితే ఆ అదృష్ట టికెట్ అసలు యజమాని దానిని ఎక్కడో పోగొట్టుకున్నాడు. ఎర్నాకుళానికి చెందిన ఒక వ్యక్తికి ఆ టికెట్ రోడ్డు మీద దొరికింది. మొదట దాన్ని ఒక మామూలు కాగితం అనుకున్నా.. తర్వాత అది లాటరీ టికెట్ అని గుర్తించి దాచుకున్నాడు. ఫలితాలు వచ్చాక చూసుకుంటే.. అదే టికెట్కు రూ.20 కోట్ల జాక్పాట్ తగిలిందని తెలిసి సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అయ్యాడు.
ఈ లోపు ఆ టికెట్ను పోగొట్టుకున్న అసలు వ్యక్తి రంగంలోకి దిగాడు. అతను సాజిమోన్ అనే రిటైర్డ్ పోలీస్ అధికారి. ‘‘ఆ టికెట్ కొన్నది నేనే, మా ఆవిడ వెళ్తుంటే దారిలో అది పోయింది.. కాబట్టి ఆ 20 కోట్లు నాకే ఇవ్వాలి’’ అంటూ ఆయన కేరళ హైకోర్టులో కేసు వేశాడు. టికెట్ పోయిన మాట నిజమే కానీ, దొరికిన వ్యక్తికి ఆ డబ్బు ఇవ్వకూడదని ఆయన వాదించాడు.
ఈ కేసును విచారించిన హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. లాటరీ నిబంధనల ప్రకారం.. ఎవరి చేతిలో అయితే అసలు టికెట్ ఉంటుందో, వారికే ఆ డబ్బు అందుతుందని స్పష్టం చేసింది. టికెట్ పోయిందని ఫిర్యాదు చేసినంత మాత్రాన బహుమతిని క్లెయిమ్ చేయలేరని కోర్టు తేల్చి చెప్పింది. దీంతో రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ వాదనను తోసిపుచ్చి, టికెట్ ఎవరి దగ్గరైతే ఉందో అతనికే ఆ రూ. 20 కోట్లు చెందుతాయని తీర్పునిచ్చింది. ఇలా రోడ్డుపై దొరికిన ఒక కాగితం ముక్క ఆ వ్యక్తిని రాత్రికి రాత్రే కోటీశ్వరుడిని చేసింది.