
భారతీయ వివాహ సంప్రదాయాలలో అల్లుడికి ఇచ్చే మర్యాదలు, బహుమతులకు చాలా ప్రత్యేకత ఉంటుంది. పెళ్లి సమయాల్లో లేదా పండుగలకు అల్లుళ్లకు బట్టలు, బంగారు ఉంగరాలు, బైక్లు కానుకగా ఇవ్వడం సర్వసాధారణం. కానీ, మహారాష్ట్రలో ఒక మామగారు తన అల్లుడిపై ఉన్న ప్రేమతో ఎవరూ ఊహించని విధంగా ఒక వినూత్నమైన బహుమతిని ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు. తన అల్లుడి రాకను మరింత ప్రత్యేకంగా మార్చడానికి ఏకంగా ఒకటిన్నర కిలోల వెండితో చేసిన కొల్హాపూరి చెప్పులను బహుమతిగా అందించారు.
ఈ ఆసక్తికరమైన ఘటన మహారాష్ట్రలోని కొల్హాపూర్లో వెలుగుచూసింది. సాంగ్లీ జిల్లాకు చెందిన ఒక సంపన్న కుటుంబానికి చెందిన మామగారు ఈ విలక్షణమైన నిర్ణయం తీసుకున్నారు. కొల్హాపూరి చెప్పులకు ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది. అందుకే, అదే శైలిలో వెండి చెప్పులు చేయించాలని ఆయన కొల్హాపూర్కు చెందిన ఒక ప్రముఖ హస్తకళాకారుడిని సంప్రదించారు. ఈ ప్రత్యేకమైన వెండి చెప్పుల జతను అత్యంత నైపుణ్యంతో, ఆకర్షణీయంగా రూపొందించడానికి ఆ కళాకారుడికి దాదాపు ఎనిమిది రోజుల సమయం పట్టింది.
పూర్తిగా వెండితో రూపుదిద్దుకున్న ఈ కొల్హాపూరి చెప్పుల బరువు సుమారు 1.5 కిలోలు ఉంది. మార్కెట్ ధరల ప్రకారం ఈ చెప్పుల విలువ దాదాపు 4 లక్షల రూపాయలుగా ఉంటుందని అంచనా. కేవలం వీటి తయారీ కూలి (మజూరీ) కోసమే సదరు కళాకారుడికి 22 వేల రూపాయలు చెల్లించినట్లు సమాచారం. బంగారం, వెండి ధరలు ఆకాశాన్ని తాకుతున్న ఈ రోజుల్లో.. ధరతో సంబంధం లేకుండా బంధాల కలయికను, తన హోదాను చాటుకోవడానికి ఈ మామగారు చేసిన ప్రయత్నం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
పెళ్లిళ్ల సీజన్ నడుస్తున్న తరుణంలో ఈ వెండి కొల్హాపూరి చెప్పుల ఫోటోలు, వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. నెటిజన్లు ఈ వినూత్నమైన ఆలోచనను చూసి ఆశ్చర్యపోతూ రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు. అల్లుడంటే ఇలాంటి మామగారే దొరకాలి అంటూ కొందరు జోకులు పేలుస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..