కరోనా లాక్డౌన్ నేపథ్యంలో విద్యార్థులకు పలు విద్యా సంస్థలు ఆన్లైన్లో క్లాస్లు నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే. కొంతమంది ఆ క్లాస్లను ఎగ్గొటుతున్నప్పటికీ.. చదువుపై ఆసక్తి ఉన్న వారు మాత్రం ఎన్నో కష్టాలు పడి మరీ క్లాస్లకు హాజరవుతున్నారు. ఇతరులతో సెల్ఫోన్లు అప్పుగా తీసుకోవడం, ఇళ్లలోకి నెట్వర్క్ రాకపోవడంతో బయట కూర్చొవడం లేదా నెట్వర్క్ వచ్చే ప్రదేశాలకు వెళ్లడం ఇలా చేస్తున్నారు. ఈ క్రమంలో ఆన్లైన్ క్లాస్ల కోసం ఇంటిపైకి ఎక్కింది ఓ విద్యార్థిని. ఆమెకు సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
వివరాల్లోకి వెళ్తే.. కేరళ మలప్పురంలోని అరీక్కల్కు చెందిన నమితా నారాయణన్ ప్రస్తుతం బీఏ ఇంగ్లీష్ ఐదో సంవత్సరం చదువుతోంది. ఆమె చదువుతున్న కాలేజీ వారు ఆన్లైన్లో క్లాస్లో పెట్టడంతో వాటిని వినడం కోసం ఇంట్లోని పలు ప్రదేశాల్లో కూర్చొని ట్రై చేసింది. అయితే ఎక్కడా సిగ్నల్ రాకపోవడంతో ఇంటిపైకి ఎక్కింది. ఇక ఎండాకాలం కావడంతో ఎండ పడకుండా ఓ గొడుగును కూడా తీసుకెళ్లింది. ఈ క్రమంలో ఆమె ఇంటిపైన ఉన్న సమయంలో అటువైపు వెళ్తోన్న ఓ ఔత్సాహికుడు నమిత ఫొటోను తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇక అది కాస్త వైరల్గా మారడంతో.. చదువు కోసం ఆమె పడుతున్న కష్టంపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇక ఈ విషయం తెలుసుకున్న ఓ ప్రైవేట్ మొబైల్ నెట్వర్క్ సంస్థ.. నమిత ఇంటికి చేరుకొని హైస్పీడ్ కనెక్షన్ ఇచ్చి వెళ్లారు. దీంతో ఇప్పుడు నమిత ఇంట్లోనే క్లాస్లు వింటోంది.
Read This Story Also: ‘ఆర్ఆర్ఆర్’ ఫ్లాప్ అయితే సినీ ఇండస్ట్రీలో పండుగ చేసుకుంటారు: వర్మ