
కర్ణాటక రాష్ట్రంలోని చెన్నపట్నం పట్టణంలో దొంగలు కొత్త దారి పట్టారు. నగలు, నగదు మాత్రమే కాకుండా ఇప్పుడు గ్యాస్ సిలిండర్లపై కూడా కన్నేస్తున్నారు. ఇటీవల కాలంలో ఇక్కడి నివాస ప్రాంతాల్లో వరుసగా గ్యాస్ సిలిండర్లు మాయమవుతుండటంతో స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే పట్టణంలోని ఒక కాలనీలో నివసిస్తున్న ఒక కుటుంబం ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లింది. ఇదే అదునుగా కొందరు ఆ ఇంట్లో చోరీకి పాల్పడ్డారు. అర్ధరాత్రి వేళ టూవీలర్పై వచ్చిన ఇద్దరు దుండగులు ఇంటి ఆవరణలోకి చొరబడ్డారు. బయట స్టాండ్లో ఉంచిన నిండు గ్యాస్ సిలిండర్ను చాకచక్యంగా విడదీసి ఎత్తుకెళ్లారు. ఉదయం ఇంటి యజమాని గమనించేసరికి సిలిండర్ కనిపించకపోవడంతో షాక్కు గురయ్యారు.
ఈ దొంగతనానికి సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. హెల్మెట్ ధరించిన ఇద్దరు వ్యక్తులు అత్యంత వేగంగా సిలిండర్ను బైక్పై పెట్టుకుని పరారవ్వడం అందులో స్పష్టంగా కనిపిస్తోంది. కేవలం ఐదు నిమిషాల వ్యవధిలోనే వారు ఈ పని ముగించుకుని వెళ్లిపోయారు. జరిగిన ఘటనపై బాధితులు స్థానిక పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ ప్రారంభించారు. గ్యాస్ సిలిండర్లను ఇంటి బయట లేదా సులభంగా దొరికే ప్రాంతాల్లో ఉంచవద్దని, వాటికి గొలుసులతో తాళం వేయడం లేదా సురక్షితమైన గదుల్లో ఉంచడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు ప్రజలను కోరుతున్నారు.
ఒకవైపు గ్యాస్ ధరలు సామాన్యుడికి భారంగా మారుతుంటే, మరోవైపు ఇలాంటి దొంగతనాలు జరగడం దారుణమని స్థానికులు వాపోతున్నారు. పాత సిలిండర్లను బ్లాక్ మార్కెట్లో విక్రయించే ముఠాలు ఈ పని చేస్తున్నాయని అనుమానిస్తున్నారు. రాత్రి సమయాల్లో పోలీసు పెట్రోలింగ్ను పెంచాలని చెన్నపట్నం వాసులు డిమాండ్ చేస్తున్నారు. కాగా, ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇది చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..