
పిజ్జా ప్రియుల కోసం రెస్టారెంట్లు రకరకాల డిస్కౌంట్లు, బై వన్ గెట్ వన్ ఆఫర్లు ప్రకటించడం మనం చూస్తుంటాం. కానీ, ఒక రెస్టారెంట్ మాత్రం నెటిజన్ల మైండ్ బ్లాక్ అయ్యేలా ఒక భయంకరమైన ఆఫర్ను ప్రకటించింది. ఉచితంగా పిజ్జా కావాలంటే డబ్బులకు బదులు పైథాన్ అవును కొండచిలువను తీసుకురావాలని ఈ రెస్టారెంట్ కస్టమర్లను కోరుతోంది. వినడానికి విచిత్రంగా ఉన్నా, సోషల్ మీడియా వేదికగా ఈ వినూత్న ఆఫర్ విపరీతంగా వైరల్ అవుతోంది.
మీరు పిజ్జాకు సంబంధించిన అనేక ఆఫర్ల గురించి విని ఉంటారు. కానీ, సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారిన ఒక పిజ్జా ఆఫర్ గురించి తెలిస్తే షాక్ అవుతారు. ఇదేం ఆఫర్ రా సామీ అంటూ ఆశ్చర్యంతో తల పట్టుకుంటారు. అమెరికాలోని ఒక రెస్టారెంట్ వినూత్నమైన ఆఫర్ను ప్రకటించింది. మీకు ఫ్రీగా పిజ్జా కావాలంటే డబ్బులకు బదులు కొండచిలువను పట్టి ఇవ్వాలని ఈ రెస్టారెంట్ కస్టమర్లను కోరుతోంది. వినడానికి విచిత్రంగా ఉన్నా, ఫ్లోరిడాలో పర్యావరణాన్ని రక్షించేందుకు జరుగుతున్న ఒక పెద్ద పోరాటంలో భాగంగానే ఈ వినూత్న ఆఫర్ పుట్టుకొచ్చింది.
ఫ్లోరిడాలోని ఎవర్గ్లేడ్స్ సిటీలో ఉన్న వైల్డ్మ్యాన్స్ పిజ్జా, పాస్తా అండ్ పైథాన్ అనే రెస్టారెంట్ యజమాని డస్టిన్ క్రమ్ ఈ సరికొత్త ఐడియాను తెరపైకి తెచ్చారు. ఫ్లోరిడాలో జూలై 10 నుండి జూలై 19 వరకు 10 రోజుల పాటు ప్రతిష్టాత్మక ఫ్లోరిడా పైథాన్ ఛాలెంజ్ జరుగుతోంది. ఈ ఈవెంట్ ముఖ్య ఉద్దేశ్యం ఎవర్గ్లేడ్స్ అడవులలో విపరీతంగా పెరిగిపోతూ, స్థానిక పశుపక్షాదులను మింగేస్తున్న ప్రమాదకరమైన బర్మీస్ పైథాన్ ల జనాభాను నియంత్రించడం. ఈ పోటీలో పాములను పట్టుకునే ప్రొఫెషనల్ వేటగాళ్లకు ప్రభుత్వం భారీ నగదు బహుమతులు కూడా ఇస్తుంది. వారికి మద్దతుగా డస్టిన్ ఈ ఉచిత పిజ్జా ఆఫర్ను ప్రకటించారు.
సదరు రెస్టారెంట్ యజమాని కేవలం పాములను సేకరించి పిజ్జాలు ఇవ్వడమే కాకుండా, పట్టుబడిన కొండచిలువల ప్రతి భాగాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. డస్టిన్ తెలిపిన వివరాల ప్రకారం, సేకరించిన పాముల చర్మంతో విలువైన క్రీములు, సబ్బులు తయారు చేస్తున్నారు. అలాగే వాటి ఎముకలను ఉపయోగించి విభిన్నమైన జ్యువెలరీ రూపొందిస్తున్నారు.
ఫ్లోరిడా పర్యావరణానికి ఈ బర్మీస్ కొండచిలువలు పెద్ద తలనొప్పిగా మారాయి. ఇవి స్థానిక జీవవైవిధ్యాన్ని దెబ్బతీస్తుండటంతో, ప్రభుత్వం వీటిని ఏరివేసే కార్యక్రమాన్ని తీవ్రతరం చేసింది. అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం, 2000 సంవత్సరం నుండి 2025 ఏప్రిల్ వరకు ఫ్లోరిడా అడవుల నుండి సుమారు 23,500 కంటే ఎక్కువ కొండచిలువలను తొలగించారు. 2017లో వీటికి ప్రత్యేక ప్రోత్సాహకాలు ప్రకటించినప్పటి నుండి పాములను పట్టుకునే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. పర్యావరణాన్ని రక్షించడంలో ఇటువంటి చిన్న చిన్న ప్రయత్నాలు కూడా పెద్ద మార్పును తీసుకువస్తాయని రెస్టారెంట్ యజమాని నమ్ముతున్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..