
ముంబైలోని అత్యంత రద్దీగా ఉండే ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్లో రైల్వే సిబ్బందికి ఒక వింత అనుభవం ఎదురైంది. ఓ రైలు ఇంజిన్ లోపల చిన్న కొండచిలువ పిల్ల ప్రత్యక్షం కావడంతో సిబ్బంది ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. రైల్వే ఇంజిన్లో పాము ఉన్నట్లు గమనించిన కార్మికులు వెంటనే అప్రమత్తమై, స్నేక్ క్యాచర్స్కు సమాచారం అందించారు. ఈ అలర్ట్ అందుకున్న జంతు సంక్షేమ అధికారి అభిషేక్ అశోక్ థావరె వెంటనే స్టేషన్కు చేరుకున్నారు. అర్ధరాత్రి దాటిన తర్వాత సుమారు 1:40 గంటల ప్రాంతంలో ఆ బుజ్జి కొండచిలువను ఆయన సురక్షితంగా పట్టుకున్నారు. సమయానికి స్పందించి రెస్క్యూ చేయడంతో రైల్వే సర్వీసులకు ఎలాంటి అంతరాయం కలగకుండా యథావిధిగా సాగాయి. ఆ తర్వాత ఆ పాము పిల్లను అడవిలో సురక్షితంగా వదిలిపెట్టారు.
నిపుణుల సమాచారం ప్రకారం.. పట్టుబడిన పాము ఇండియన్ రాక్ పైథాన్ జాతికి చెందినది. ఇది విషపూరితమైనది కాదు. భారత వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద దీనికి రక్షణ ఉంది. పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో ఈ జాతి కీలక పాత్ర పోషిస్తుంది. ప్రస్తుతం మహారాష్ట్రలో వర్షాలు కురుస్తుండటంతో తలదాచుకోవడానికి పొడి ప్రాంతాలను వెతుక్కుంటూ ఈ పాము పిల్ల రైల్వే ఇంజిన్లోకి దూరి ఉండవచ్చని భావిస్తున్నారు.
‘‘వర్షాకాలంలో ఇలాంటి సంఘటనలు సహజం. నివాస ప్రాంతాల్లో పాములు కనిపిస్తే ప్రజలు ఎవరూ భయాందోళనలకు గురికావద్దు. వాటిని సొంతంగా పట్టుకోవడానికి గానీ, చంపడానికి గానీ ప్రయత్నించకూడదు. వెంటనే అటవీ శాఖకు లేదా స్నేక్ క్యాచర్స్కు సమాచారం అందించి వన్యప్రాణులను, మీ ప్రాణాలను కాపాడుకోండి.” అని అభిషేక్ అశోక్ థావరె తెలిపారు.
A baby python was discovered inside the engine of a train at Chhatrapati Shivaji Maharaj Terminus (CSMT) around midnight. Railway staff noticed the reptile and immediately sought assistance from a trained snake rescuer. pic.twitter.com/K4dcGKxmEH
— Rajendra B. Aklekar (@rajtoday) June 24, 2026