
భారతదేశంలో మారుతున్న జీవనశైలికి తగ్గట్టుగానే సంబంధాల విషయంలో కూడా సంచలన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ప్రముఖ డేటింగ్ ప్లాట్ఫామ్ ఆష్లే మాడిసన్ విడుదల చేసిన నివేదిక భారతీయుల వ్యక్తిగత సంబంధాలపై విస్తుపోయే నిజాలను వెలుగులోకి తెచ్చింది. ఒకప్పుడు కేవలం మెట్రో నగరాలకే పరిమితమైన వివాహేతర సంబంధాలు, ఇప్పుడు ద్వితీయ శ్రేణి నగరాల్లో కూడా వేగంగా విస్తరిస్తున్నాయని ఈ సర్వే స్పష్టం చేసింది.
ఆలయాలకు, పట్టు చీరలకు ప్రసిద్ధి చెందిన తమిళనాడులోని కాంచీపురం ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. గత ఏడాది 17వ స్థానంలో ఉన్న ఈ నగరం.. కేవలం ఒక్క సంవత్సరంలోనే మొదటి స్థానానికి చేరుకుంది. చిన్న పట్టణాల్లో కూడా డేటింగ్ యాప్ల వినియోగం ఏ స్థాయిలో పెరుగుతుందో చెప్పడానికి ఇదొక నిదర్శనం.
దేశ రాజధాని ప్రాంతం ఈ ప్లాట్ఫామ్ వినియోగంలో భారీ రికార్డులను నమోదు చేసింది. సెంట్రల్ ఢిల్లీ రెండవ స్థానంలో ఉండగా, టాప్ 20 జాబితాలో ఢిల్లీకి చెందిన 9 ప్రాంతాలు చోటు సంపాదించుకున్నాయి. గురుగ్రామ్, నోయిడా, ఘజియాబాద్ వంటి నగరాలు కూడా ముందంజలో ఉన్నాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే దేశ ఆర్థిక రాజధాని ముంబై ఈసారి టాప్ 20 నగరాల జాబితాలో లేకపోవడం గమనార్హం.
కాంచీపురం, ఢిల్లీ తర్వాత వరుసగా గురుగ్రామ్, గౌతమ్ బుద్ధ నగర్, డెహ్రాడూన్, పూణే, బెంగళూరు, చండీగఢ్, లక్నో, కోల్కతా, హైదరాబాద్ వంటి నగరాలు ఈ జాబితాలో చోటు దక్కించుకున్నాయి. ఇందులో హైదరాబాద్ 11వ స్థానంలో ఉంది. వివాహేతర సంబంధాలను అంగీకరించే వ్యక్తుల రేటు భారత్, బ్రెజిల్లో అత్యధికంగా ఉందని, దాదాపు 53శాతం మంది భారతీయులు తమ జీవితంలో ఏదో ఒక సమయంలో ఇటువంటి సంబంధాల్లో పాల్గొన్నారని సర్వే పేర్కొంది.
ఈ పెరుగుదల వెనుక సామాజిక, మానసిక కారణాలు ఉన్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
పని ఒత్తిడి: సుదీర్ఘ పని గంటల వల్ల భాగస్వాముల మధ్య సమయం తగ్గడం.
భావోద్వేగ దూరం: సంబంధాల్లో పెరిగిన కమ్యూనికేషన్ గ్యాప్.
ఆన్లైన్ ప్రైవసీ: డేటింగ్ యాప్లు అందించే గోప్యత వల్ల వ్యక్తులు ఇతరులతో రహస్యంగా కనెక్ట్ అవ్వడం సులభమైంది.
వ్యక్తిగత స్వేచ్ఛ: ఆధునిక జీవనశైలిలో వ్యక్తిగత స్వేచ్ఛకు ఇస్తున్న ప్రాధాన్యత కూడా ఒక ప్రధాన కారణంగా కనిపిస్తోంది.
మొత్తానికి.. ఒకప్పుడు మెట్రో నగరాలకే పరిమితమైన ఈ ధోరణి ఇప్పుడు చిన్న నగరాలకు కూడా పాకిపోవడం సమాజంలో మారుతున్న విలువలకు అద్దం పడుతోంది.