
అమలాపురం (కోనసీమ జిల్లా): పచ్చని కోనసీమలో పశువులకు, పాడి రైతులకు ఉన్న అనుబంధం ప్రత్యేకమైనది. తాజాగా అమలాపురం రూరల్ మండలం సాకుర్రు గ్రామంలో నిర్వహించిన లేగ దూడల అందాల పోటీలు ఈ విషయాన్ని మరోసారి నిరూపించాయి. పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ వినూత్న కార్యక్రమం చూపరులను మంత్రముగ్ధులను చేసింది. ఈ అందాల పోటీల్లో పాల్గొనేందుకు మండలంలోని వివిధ గ్రామాల నుండి రైతులు తమ లేగ దూడలను తీసుకువచ్చారు. పుంగనూరు, జెర్సీ, కపిల, దేశావళీ వంటి మేలు రకపు జాతులకు చెందిన దూడలను పూలమాలలు, రంగురంగుల వస్త్రాలతో అందంగా అలంకరించారు. ముద్దుగా, చురుగ్గా కదులుతున్న ఆ లేగ దూడలను చూసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
ఎమ్మెల్యే ఆనందరావు పిలుపు: కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న అమలాపురం ఎమ్మెల్యే అయితబత్తుల ఆనందరావు విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేటి కాలంలో కల్తీ పాలు ఆరోగ్యానికి ముప్పుగా మారుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి ఇంట్లో ఒక గోవును పెంచుకోవడం ద్వారా స్వచ్ఛమైన పాలు తాగి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. పాడి రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను ప్రతి రైతు వినియోగించుకోవాలని కోరారు.
బిడ్డల్లా సాకుతున్న రైతులు: మేము ఈ ఆవులను కేవలం పశువుల్లా చూడటం లేదు, మా ఇంట్లో పిల్లల వలె సాకుతున్నాం. వాటికి సమయానికి ఆహారం ఇస్తూ, ఎంతో ప్రేమగా పెంచుకుంటాం అని రైతులు ఆనందంగా తెలిపారు. తమ దూడలు అందాల పోటీల్లో గెలవడంపై వారు హర్షం వ్యక్తం చేశారు. కాలేజీ ఫ్యాషన్ షోలను తలపించేలా సాగిన ఈ డమ్స్ సెషన్ గ్రామీణ వాతావరణంలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. పాడి పరిశ్రమను ప్రోత్సహించడానికి ఇటువంటి పోటీలు ఎంతగానో దోహదపడతాయని అధికారులు అభిప్రాయపడ్డారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..