
భారతీయ చరిత్ర కేవలం మన దేశంతోనే ఆగిపోలేదు.. ఇది ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలకు విస్తరించిందని.. తాజాగా థాయిలాండ్ తవ్వకాల్లో దొరికిన భారతీయ అనవాళ్లే సాక్షంగా నిలుస్తున్నాయి. అవును ఇటీవల పమ థాయిలాండ్లోని పెచ్చబరి ప్రావిన్స్లో జరిగిన తవ్వకాల్లో సుమారు 2000 ఏళ్ల నాటి పురాతన బంగారు ఉంగరాలు బయటపడ్డాయట.. వాటిలో ఒకదానిపై భారతదేశానికి చెందిన పురాతన బ్రహ్మీ లిపి ముద్రించబడి ఉందని..మరో ఉంగరంపై మాత్రం ఎలాంటి అక్షరాలు లేకుండా ప్లేయిన్గా ఉందని అధికారులు చెబుతున్నారు.
అయితే ఆ ఉంగరంపై “పుసారఖితస” అని రాసి ఉందట.. అంటే ఆనాటి భారతీయ భాష ప్రకారం పుష్య నక్షత్రం చేత రక్షించబడే వ్యక్తి అని అర్థమట. భారతీయ ఖగోళ, జ్యోతిష్య శాస్త్రాలలో ఈ పుష్యమిని అత్యంత శుభప్రదమైన నక్షత్రంగా భావిస్తారట. ఉంగరంపై ఉన్న లిపిని బట్టి చూస్తే.. ఇది భారతదేశంలోని వైశ్యకులానికి చెందిన సంపన్నులైన వ్యాపారివి అయి ఉంటాయని అధికారులు భావిస్తున్నారు. అంటే అప్పట్లో భారతదేశం, థాయిలాండ్ మధ్య వ్యాపార సంబంధాలు కొనసాగాయని తెలుస్తోంది.
ఇనుప యుగం నాటి సంపన్నుల సమాధులు
అయితే ఈ తవ్వకాలు ప్రస్తుతం బ్యాంకాక్కు నైరుతి దిశలో 130 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రాంతంలో జరుగుతున్నాయని.. ఇటీవల అక్కడ ఓ వరి పొలంలో పురాతన కాంస్య డ్రమ్ ముక్కలు దొరకడంతో ఇక్కడ తవ్వకాలు స్టార్ట్ చేసినట్టు అధికారులు చెబుతున్నారు. ఇది 1,500 నుండి 2,500 సంవత్సరాల క్రితం నాటి చివరి చరిత్రపూర్వ యుగానికి చెందిన ప్రాంతంగా గుర్తించారు.
తవ్వకాలు చేపట్టినప్పటి నుంచి ఇప్పటివరకు అక్కడ ఎనిమిది మానవ అస్థిపంజరాలతో పాటు విలువైన కుండలు, కాంస్య, బంగారు ఆభరణాలు దొరికాయని.. వీటిని పూడ్చిపెట్టిన విధానాన్ని బట్టి చూస్తే, ఇది ఆ కాలంలోని సంపన్నులు లేదా ఉన్నత వర్గాల వారికి అంత్యక్రియలు నిర్వహించే ప్రత్యేక స్థలమని స్పష్టమవుతోంది. మరో నెల రోజుల్లో ఈ తవ్వకాల పనులు ముగియనున్నాయని, ఆ తర్వాత ఈ అరుదైన చారిత్రక వస్తువులను ప్రజల సందర్శనార్థం ప్రదర్శనకు ఉంచనున్నట్లు అధికారులు వెల్లడించారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.