Telangana: తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. రూ.500కే గ్యాస్ సిలిండర్ ఎప్పట్నుంచంటే

ఆరు గ్యారంటీల్లో మరో రెండు గ్యారంటీలను త్వరలోనే అమలు చేయనుంది..తెలంగాణ ప్రభుత్వం. ప్రజాపాలన దరఖాస్తులపై సమీక్ష నిర్వహించిన సీఎం రేవంత్‌రెడ్డి..అధికారులకు ఈ మేరకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకోలేకపోయిన లబ్దిదారులకు..మరోసారి అవకాశం కల్పించాలని అధికారులను ఆదేశించారు.

Telangana: తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. రూ.500కే గ్యాస్ సిలిండర్ ఎప్పట్నుంచంటే
Gas Cylinder

Updated on: Feb 02, 2024 | 9:54 AM

తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్. ఆరు గ్యారంటీల్లో భాగంగా త్వరలోనే మరో రెండు గ్యారంటీలను అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.. రేవంత్ సర్కార్. ప్రజాపాలన దరఖాస్తులపై సచివాలయంలో రివ్యూ చేసిన సీఎం రేవంత్‌రెడ్డి.. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రజా పాలనలో దరఖాస్తు చేసుకున్న అర్హులందరికీ లబ్ధి జరిగేలా గ్యారంటీలను అమలు చేయాలని స్పష్టం చేశారు. ఐదు వందలకే గ్యాస్‌ సిలిండర్‌, ఇందిరమ్మ ఇళ్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు పథకాలపై సంబంధిత విభాగాల అధికారులతో సీఎం రేవంత్‌ చర్చించారు. ఈ 3 గ్యారంటీల అమలుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికతో సిద్ధంగా ఉండాలని అధికారులకు సూచించారు. వీటిలో రెండింటిని తక్షణమే అమలు చేసేందుకు ఏర్పాట్లు చేయాలని చెప్పారు. ఆ రెండు ఏంటి అనే నిర్ణయం కోసం ఈ నెల 6న  సీఎం మరోసారి ప్రజా పాలన సబ్ కమిటీతో భేటీ అవ్వనున్నారు. ఒక్కో గ్యారంటీ అమలుకు బడ్జెట్ ఎంత అవుతుంది ? ఎంత మందికి ప్రయోజనం కలుగుతుందనే వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్న ముఖ్యమంత్రి.. వాటికి అవసరమైన నిధులను ఈ బడ్జెట్‌లోనే కేటాయించాలని ఆర్థిక శాఖకు సూచించారు. అర్హులందరికీ లబ్ధి చేకూరేలా పథకాల అమలు చేయాలని సీఎం నిర్ణయించారు.

రాష్ట్రవ్యాప్తంగా గత ఏడాది డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకూ ప్రజాపాలన కార్యక్రమం జరిగింది. ఇందులో ప్రభుత్వం ప్రకటించిన అయిదు గ్యారంటీలకు ప్రజలనుండి దరఖాస్తులను స్వీకరించారు. అయిదు గ్యారంటీలకు మొత్తం 1 కోటి 9 లక్షల 12 వందల 55 దరఖాస్తులు వచ్చాయి. జనవరి 12 నాటికే ఈ దరఖాస్తులకు సంబంధించిన డేటా ఎంట్రీని రికార్డు సమయంలో పూర్తి చేసినట్లు అధికారులు సీఎంకు చెప్పారు. కొందరు ఒకే పేరుతో రెండు మూడు దరఖాస్తులు ఇచ్చారని..మరికొన్ని దరఖాస్తుల్లో ఆధార్, రేషన్ కార్డు నెంబర్లు సరిగా లేవని అధికారులు నివేదించారు. అలాంటి దరఖాస్తులను మరోసారి పరిశీలించాలని..అవసరమైతే క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలన జరపాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. అర్హులైన వారెవరూ నష్టపోకుండా ఒకటికి రెండు సార్లు సరి చూడాలని చెప్పారు. దరఖాస్తుల్లో తప్పులుంటే వాటిని సరిదిద్దుకునేందుకు MPDO ఆఫీసుల్లో లేదా తదుపరి నిర్వహించే ప్రజా పాలన కార్యక్రమంలో మరోసారి అవకాశమిచ్చే ఏర్పాట్లు చేయాలని చెప్పారు సీఎం రేవంత్. గ్యారంటీల అమలుకు లేని పోని నిబంధనలు పెట్టి ఎవరినీ ఇబ్బంది పెట్టవద్దని స్పష్టం చేశారు. దరఖాస్తు చేసిన వారిలో అర్హులైన వారందరూ లబ్ధి పొందేలా చూడాలని అన్నారు. దరఖాస్తు చేయని వారుంటే..నిరంతర ప్రక్రియగా మళ్లీ దరఖాస్తు చేసే అవకాశం కల్పించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.  

Loading...
Unable to load recommendations.
Follow Us