
దేశంలోనే అత్యధిక వాహనాల రద్దీ కలిగిన హైవేగా హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారి పేరుంది. సంక్రాంతి పండుగ కోసం పల్లెబాట పట్టడంతో హైదరాబాద్ మహా నగరం జన సంచారం లేకుండా నిర్మానుష్యంగా మారింది. ముచ్చటైన మూడు రోజుల సంక్రాంతి పండుగను సొంతూళ్లలో జరుపుకొని తిరుగు ముఖం పడుతున్నారు నగర వాసులు. సంక్రాంతి పండుగ కోసం హైదరాబాద్ నుండి విజయవాడ వైపు మూడు రోజుల్లో మూడు లక్షల వాహనాలు వెళ్లాయి. పండుగ సంబరం పూర్తి కావడంతో తిరుగు ముఖం పడుతున్నారు.
సంక్రాంతి పండుగ నేపథ్యంలో సొంతూరికి వెళ్ళిన వాహనాలతో మూడు రోజుల కిందట హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. గంటల తరబడి వాహన దారులు ట్రాఫిక్ లో ఇరుక్కుపోయి ఇబ్బందులు పడ్డారు. తిరుగు ప్రయాణంలో రెండు తెలుగు రాష్ట్రాల నుండి ఒకేసారి హైదరాబాద్ – విజయవాడ (ఎన్ హెచ్ 65) జాతీయ రహదారి మీదుగా హైదరాబాద్ వస్తుంటారు.
తిరుగు ప్రయాణం నేపథ్యంలో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్ – విజయవాడ హైవేపై సంక్రాంతి ట్రాఫిక్ రద్దీ నివారణకు పోలీసులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. నేషనల్ హైవే- 65పై బ్లాక్ స్పాట్స్ వద్ద ఫ్లైఓవర్, బ్రిడ్జిలు, అండర్ పాస్ ల నిర్మాణాలు కొనసాగుతున్నాయి. బ్లాక్ స్పాట్స్ వద్ద వాహనాల రద్దీ పెరిగే అవకాశం ఉంది. మరోవైపు అద్దంకి – నార్కెట్పల్లి హైవే మీదుగా హైదరాబాద్ వచ్చే వాహనాలు నార్కట్పల్లి వద్ద ఎన్ హెచ్ 65ని కలుస్తాయి.
దీంతో నార్కట్పల్లి నుండి హైదరాబాద్ – విజయవాడ హైవేపై వాహనాల మరింత రద్దీ ఏర్పడే అవకాశం ఉంది. దీంతో హైదరాబాద్ తిరుగు ప్రయాణంలో ఎన్ హెచ్ 65పై పోలీస్ శాఖ ప్రత్యేక ట్రాఫిక్ డైవర్షన్ చేపట్టారు. ఏపీ నుంచి హైదరాబాద్ వచ్చే వాహన దారులు తాము సూచించే ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించుకోవాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు.
గుంటూరు → మిర్యాలగూడ → హాలియా → కొండమల్లేపల్లి → చింతపల్లి – మాల్ మీదుగా హైదరాబాద్.
మాచర్ల నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలు :
మాచర్ల → నాగార్జునసాగర్ → పెద్దవూర → కొండమల్లేపల్లి → చింతపల్లి → మాల్ మీదుగా హైదరాబాద్.
నల్లగొండ నుంచి హైదరాబాద్ వైపు వెళ్లే వాహనాలు :
నల్లగొండ → మర్రిగూడ బై పాస్ → మునుగోడు → నారాయణపూర్ → చౌటుప్పల్ (ఎన్.హెచ్ 65) మీదుగా హైదరాబాద్.
విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే భారి వాహనాలు..
కోదాడ → హుజూర్నగర్ → మిర్యాలగూడ → హాలియా → చింతపల్లి → మాల్ మీదుగా హైదరాబాద్.
ఎన్ హెచ్ 65పై చిట్యాల, పెద్దకాపర్తిలో ప్లై ఓవర్ నిర్మాణాలతో ట్రాఫిక్ జామ్ ఏర్పడితే చిట్యాల నుండి భువనగిరి మీదుగా హైదరాబాద్కు మళ్లించడం జరుగుతుందని. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వెళ్లడం వల్ల ప్రధాన రహదారి విజయవాడ – హైదరాబాద్ పై ట్రాఫిక్ ఒత్తిడి తగ్గి, ప్రయాణికులు గమ్య స్థానాలకు త్వరగా చేరుకోవచ్చని పోలీసులు చెబుతున్నారు.
తిరుగుముఖం పడుతున్న నగరవాసులు హైదరాబాద్కు సురక్షితంగా చేరుకోవాలన్నదే పోలీస్ శాఖ లక్ష్యం. ట్రాఫిక్ రద్దీ కారణంగా ఎలాంటి అసౌకర్యాలు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో దారి మళ్లింపు చర్యలు అమలు చేస్తున్నామని సూర్యాపేట, నల్లగొండ జిల్లాల ఎస్పీలు చెబుతున్నారు. హైవేపై వాహనాల రద్దీ నివారణకు డ్రోన్ కెమెరాలు, సీసీటీవీ నిఘాతో ట్రాఫిక్ పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తామని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో డయల్ 100 ను సంప్రదించాలని సూచిస్తున్నారు. వాహనదారులు తాము సూచించిన మార్గాలను ఫాలో కావాలని పోలీసులు కోరుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..