
తెలంగాణ అవతరణ దినోత్సవం రోజు రాష్ట్రంలోని నిరుద్యోగులకు టీజీపీఎస్సీ సూపర్ గుడ్న్యూస్ చెప్పింది. జూన్ -2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలో కొత్తగా మూడు నోటిఫికేషన్లు విడుదల చేస్తున్నట్టు తెలిపింది. ఈ మేరకు టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం మూడు నోటిఫికేషన్లకు సంబంధించి వివరాలు వెల్లడించారు. ఇంజనీరింగ్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, అటవీశాఖ, టౌన్ అండ్ కంట్రీప్లానింగ్, విద్యాశాఖలలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కానున్నట్టు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల నియామక ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగుతుందని తెలిపారు. తాగా విడుదల కానున్న నోటిఫికేషన్లలో అత్యధికంగా అటవీశాఖలో పోస్ట్ భర్తీ చేయనున్నట్టు తెలిపారు. ఈ శాఖలో మొత్తం 3,093 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్నారు. ఈ ఒక్క నెలలోనే 5 నుంచి 6 కొత్త నోటిఫికేషన్లను విడుదల చేసేందుకు కమిషన్ కసరత్తు చేస్తోందని.. వివిధ ప్రభుత్వ విభాగాల్లో ఖాళీగా ఉన్న దాదాపు 3,800 ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతులు మంజూరు చేసిందన్నారు.
ప్రస్తుతం 28 కేటగిరీల పోస్టుల్లో ఒక్కొక్క ఖాళీ చొప్పున, మరో 25 కేటగిరీల పోస్టుల్లో ఐదు కంటే తక్కువ చొప్పున ఖాళీలు ఉన్నట్లు చైర్మన్ వివరించారు. రాబోయే రోజుల్లో మరిన్ని నోటిఫికేషన్లను వరుస క్రమంలో తీసుకువచ్చేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నట్లు బుర్రా వెంకటేశం వెల్లడించారు.
ఇక తెలంగాణ ఆవిర్భావ దినోత్సం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. యువతకు ఇచ్చిన మాట ప్రకారం ఉద్యోగాల భర్తీ ప్రక్రియను విజయవంతంగా చేపట్టామన్నారు. లీగల్ సమస్యలు, లిటిగేషన్లకు ఆస్కారం లేకుండా కొలువుల భర్తీ చేశామన్నారు. ఉద్యోగ నియామక ప్రక్రియలో పారదర్శకతను పునరుద్ధరించామన్నారు. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4తో పాటు మెగా డీఎస్సీ, వైద్యారోగ్య శాఖలో వరుసగా నియామకాలను చేపట్టామని.. రికార్డు సమయంలో 67,763 పోస్టులను భర్తీ చేసి యావత్ దేశానికే ఆదర్శంగా నిలిచాంమన్నారు.
ఈ నెలలోనే టిజిపిఎస్సి ద్వారా ఇంజనీరింగ్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, అటవీశాఖ, టౌన్ అండ్ కంట్రీప్లానింగ్, విద్యాశాఖలలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వనున్నామన్నారు. తెలంగాణ ప్రభుత్వ విద్యలో విప్లవాత్మక సంస్కరణలకు శ్రీకారం చుట్టామని.. కేంద్ర ప్రభుత్వం రెండు రోజుల క్రితం విడుదల చేసిన ఫెర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ లో తెలంగాణ మంచి స్థానాన్ని పొందిందన్నారు. తెలంగాణ పబ్లిక్ స్కూళ్ల ఏర్పాటు నుంచి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల వరకు ప్రతి ప్రయత్నంలో విద్యా వ్యవస్థ బలోపేతం చేసే లక్ష్యంగా పని చేస్తున్నామన్నారు. రాష్ట్రంలోని 65 ఐటీఐలు, పాలిటెక్నిక్ కళాశాలలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా పునర్ వ్యవస్థీకరించామని సీఎం తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.