
తెలంగాణ రాజకీయం ప్రస్తుతం తీవ్ర స్థాయికి చేరుకుంది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతల మధ్య నడుస్తున్న ‘డేట్, టైమ్, లొకేషన్’ సవాళ్లు రాష్ట్రంలో పొలిటికల్ హీట్ను పీక్స్కు తీసుకెళ్లాయి. నిన్నటివరకు కేవలం ప్రెస్ మీట్లు, ట్వీట్లకే పరిమితమైన విమర్శల పర్వం.. ఇప్పుడు “ఇవాళ ఉదయం 11 గంటల” డెడ్లైన్కు చేరింది. ముహూర్తం ఒక్కటే అయినప్పటికీ, నేతలు కొట్లాడేందుకు ఎంచుకున్న వేదికలు మాత్రం మూడు కావడం విశేషం. అటు తెలంగాణ భవన్, ఇటు సోమాజిగూడ ప్రెస్ క్లబ్, మరోవైపు గన్ ఫౌండ్రీ అమరవీరుల స్థూపం.. ఎక్కడ చూసినా 11 గంటల సమయం చుట్టూనే ఉత్కంఠ తిరుగుతోంది.
రేవంత్ వర్సెస్ కేటీఆర్: అశోక్నగర్ టు తెలంగాణ భవన్
గత పదేళ్ల బీఆర్ఎస్ పాలన, అప్పులపై చర్చకు సిద్ధమా అంటూ సీఎం రేవంత్ రెడ్డి విసిరిన ఛాలెంజ్తో ఈ పొలిటికల్ థ్రిల్లర్ మొదలైంది. ఈ సవాల్ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంతే మాస్గా స్వీకరించారు. “చర్చకు వరంగలైనా సరే, హైదరాబాద్ అశోక్నగరైనా సరే.. నేను రెడీ” అంటూ ప్రతిసవాల్ విసిరారు. దీనిపై కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి స్పందిస్తూ.. “ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీలాగా ఖాళీగా లేరు, గత ప్రభుత్వం చేసిన అప్పులు కట్టడానికే మాకు సమయం సరిపోతోంది” అంటూ సెటైర్లు వేశారు.
అయితే, ఈ సవాల్ను మంత్రి జూపల్లి కృష్ణారావు మరో లెవెల్కు తీసుకెళ్లారు. కేటీఆర్ విసిరిన ఛాలెంజ్ను స్వీకరిస్తూ.. “ఇవాళ ఉదయం 11 గంటలకు నేరుగా తెలంగాణ భవన్కే (బీఆర్ఎస్ హెడ్క్వార్టర్స్) వస్తున్నా.. కమాన్ కేటీఆర్ కాస్కో” అంటూ టైమ్, లొకేషన్ ఫిక్స్ చేసి క్షేత్రస్థాయి చర్చకు సై అన్నారు.
ప్రెస్ క్లబ్ వర్సెస్ అమరవీరుల స్థూపం
మరోవైపు గురుకులాల టెండర్లలో కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 2,000 కోట్ల కుంభకోణానికి పాల్పడిందంటూ బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన ఆరోపణలు చేశారు. దీనిపై నిజానిజాలు తేల్చుకునేందుకు “ఇవాళ ఉదయం 11 గంటలకు ఆధారాలతో సోమాజిగూడ ప్రెస్ క్లబ్కు వస్తున్నా.. కాంగ్రెస్ మంత్రులు కూడా దమ్ముంటే ఆధారాలతో రావాలి” అని సవాల్ విసిరారు.
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఛాలెంజ్ను కాంగ్రెస్ మంత్రులు అంతే సీరియస్గా తీసుకున్నారు. అయితే వారు వేదికను మార్చారు. ప్రజల సమక్షంలోనే తేల్చుకుందామంటూ ఉదయం 11 గంటలకు గన్ ఫౌండ్రీ అమరవీరుల స్థూపం దగ్గరకు రావాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ప్రతిసవాల్ విసిరారు. “ఈ చర్చకు కేటీఆర్, హరీష్రావు వస్తే.. నేను, మంత్రి పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్ కలిసి వస్తాం. అవినీతి నిరూపిస్తే తక్షణమే రాజీనామా చేస్తా” అని అడ్లూరి ప్రకటించారు. ఒకవేళ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఒక్కరే వస్తే ఆయనతో చర్చించడానికి కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధులు చాలని స్పష్టం చేశారు.
మంత్రి పొన్నం ప్రభాకర్ సైతం ఈ వ్యవహారంపై ఘాటుగా స్పందించారు. బీఆర్ఎస్ మాజీ మంత్రులతో సహా ఎవరితోనైనా, ఏ వేదికపైనైనా చర్చకు తాము సిద్ధమన్నారు. ప్రెస్ క్లబ్లోనైనా, అసెంబ్లీలోనైనా పూర్తి పారదర్శకంగా మాట్లాడతామని, అయితే ప్రవీణ్ కుమార్ పరిధి దాటి బలహీన వర్గాలను కించపరిచేలా మాట్లాడటం మానుకోవాలని హెచ్చరించారు.
మొత్తానికి.. తెలంగాణ భవన్, ప్రెస్ క్లబ్, అమరవీరుల స్థూపం.. ఈ మూడు వేదికల వద్ద 11 గంటల డెడ్లైన్తో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. సవాళ్లు విసిరిన నేతల్లో స్పాట్కు వచ్చేది ఎవరు? వెనకడుగు వేసేది ఎవరు? అన్నది ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత ఆసక్తికరంగా మారింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..