
తెలంగాణలో కొత్త పించన్ల కోసం ఎదురుచూస్తున్నవారికి శుభవార్త. కొత్త పింఛన్ల పంపిణీకి రేవంత్ సర్కార్ ముహూర్తం ఖారారు చేసింది. దసరా కానుకగా కొత్త పింఛన్లను అందించనుంది. కొత్తగా రాష్ట్రవ్యాప్తంగా 2.50 లక్షల నూతన పింఛన్లను మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అర్హుల నుంచి దరఖాస్తులు కూడా స్వీకరించింది. లక్షల మంది దరఖాస్తులు చేసుకోగా.. వీరిలో అసలైన అర్హులను ఎంపిక చేయాల్సి ఉంది. దరఖాస్తు చేసుకున్నవారి ఇంటికి అధికారులు నేరుగా వెళ్లనున్నారు. వారికి నిజంగా అర్హత ఉందా.. లేదా అనే వివరాలు పరిశీలించనున్నారు. ఈ నెలాఖరు వరకు ఈ ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అనంతరం వచ్చే నెల తొలివారంలో అర్హులను ఎంపిక చేసి జాబితా సిద్దం చేయనున్నారు.
అర్హులైన వారికి దసరా నుంచి పించన్ సొమ్ము పంపిణీకి ప్రభుత్వం సిద్దమవుతోంది. ఇప్పటికే ఇందుకు అవసరమైన బడ్జెట్ కూడా కేటాయించారు. దీంతో అర్హులను ఎంపిక చేయడమే తరువాయి. ఈ నెలలోనే పరిశీలన పూర్తి చేసి పించన్ మంజూరు చేయాలని ప్రభుత్వం భావించింది. అయితే క్షేత్రస్థాయి పరిశీలనలో జాప్యం, సర్టిఫికేట్ల జారీలో సమస్యలు తలెత్తడంతో ఆలస్యమైంది. ఆగస్ట్ 9 నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తుండగా.. సెప్టెంబర్ 15వ తేదీ వరకు గడువు పొడిగించింది. అయితే దివ్యాంగులు, డయాలసిస్, ఫైలేరియా, చేనేత, గీత కార్మికులు, వితంతువులు, ఒంటరి మహిళల అర్హతలను నిర్ధారించేందుకు పత్రాలు అవసరం. ఒంటరి మహిళలకు సంబంధించి విడాకుల డాక్యుమెంట్స్, కోర్టు ఉత్తర్వులతో పాటు ఏడాదిగా ఒంటరిగా ఉంటున్నట్లు ధ్రువీకరణ అవసరమవుతుంది. అలాగే వితంతువులు భర్త డెత్ సర్టిఫికేట్ సమర్పించాలి. అయితే భర్త చనిపోయి ఎక్కవకాలం అయితే సర్టిఫికేట్ పొందటంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి.
ఇక గీత, చేనేత, ఫైలిరియా, డయాలసిస్ వర్గాలకు సంబంధించి సంబంధిత శాఖల నుంచి ధృవీకరణ పత్రాలు పొందటంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దీంతో ధ్రువీకరణ పత్రాల అవసరం లేకుండానే దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. అయితే ఆ తర్వాత ధృవీకరణ సమయంలో పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. అప్పుడే పింఛన్లకు అర్హత సాధిస్తారు. అధికారులో క్షేత్రస్థాయిలో పర్యటించి కుటుంబ పరిస్థితి, ఆదాయం, ఇతర ఆధారాలను పరిశీలించనున్నారు. అనంతరం తుది జాబితా సిద్దం చేయనున్నారు. ప్రస్తుతం 2.50 లక్షల పింఛన్లకు మాత్రమే ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీంతో అంతమంది అర్హులను మాత్రమే ప్రస్తుతం ఎంపిక చేయనున్నారు. ప్రాధాన్యత వారీగా పూర్తి అర్హతలు ఉన్నవారిని ఎంపిక చేయనున్నారు. దసరా నుంచి కొత్త ఫించన్లను అందనుడటంతో అర్హులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు తుది జాబితా సిద్దం చేసి ప్రభుత్వానికి పంపనున్నారు. ప్రభుత్వం ఆమోదించాక పింఛన్లను పంపిణీ చేయనున్నారు.