Telangana: కొత్త పింఛన్లపై తెలంగాణ సర్కార్ కీలక ప్రకటన.. ఎవరు అప్లై చేయాలి.. ఎవరు అక్కర్లేదు? పూర్తి వివరాలివే..

తెలంగాణలో కొత్త పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. పింఛన్ల మంజూరు ప్రక్రియను వేగవంతం చేయడమే కాకుండా, అర్హతల విషయంలో నెలకొన్న పలు అనుమానాలకు పూర్తిస్థాయిలో తెరదించింది. కొత్త నిబంధనలంటూ ఏవీ తేలేదని, పాత రూల్స్ ప్రకారమేఅర్హులకు పింఛన్లు అందిస్తామని తేల్చిచెప్పింది. ఎవరు దరఖాస్తు చేసుకోవాలి? ఏ ఏ పత్రాలు జతచేయాలి? అనే అంశాలపై కీలక ప్రకటన విడుదల చేసింది.

Telangana: కొత్త పింఛన్లపై తెలంగాణ సర్కార్ కీలక ప్రకటన.. ఎవరు అప్లై చేయాలి.. ఎవరు అక్కర్లేదు? పూర్తి వివరాలివే..
Telangana New Pensions 2026

Updated on: Aug 11, 2026 | 7:59 PM

రాష్ట్రంలో కొత్త పింఛన్ల మంజూరు ప్రక్రియను తెలంగాణ ప్రభుత్వం వేగవంతం చేసింది. ఈ క్రమంలో పింఛన్ల అర్హతలకు సంబంధించి నెలకొన్న సందేహాలపై ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. గత ప్రభుత్వాల హయాంలో జారీ చేసిన ప్రభుత్వ ఉత్తర్వుల్లోని అర్హత ప్రమాణాలనే ఇప్పుడు కూడా ప్రామాణికంగా తీసుకుంటున్నామని, నిబంధనల్లో ఎలాంటి మార్పులు చేయలేదని వెల్లడించింది. తొలిదశలో వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, గీత కార్మికులు, చేనేత కార్మికులతో పాటు ఫైలేరియా, తలసేమియా, సికిల్ సెల్, హీమోఫీలియా వంటి వ్యాధులతో బాధపడుతున్న బాధితులకు కొత్త పింఛన్లు మంజూరు చేయనున్నారు.

ఎవరు దరఖాస్తు చేయాలి? ఎవరు చేయక్కర్లేదు?

గతంలో ప్రజాపాలన వారోత్సవాలు, ప్రగతి ప్రణాళిక గ్రామసభలు, ప్రజావాణిలో దరఖాస్తు చేసుకుని.. అన్ని పత్రాలు సమర్పించిన వారు మళ్లీ అప్లై చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటివరకు అసలు దరఖాస్తు చేసుకోనివారు, లేదా గతంలో దరఖాస్తు చేసి సరైన సర్టిఫికెట్లు సమర్పించని వారు మాత్రమే కొత్తగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.

కావాల్సిన ధ్రువపత్రాలు

  • వితంతువులు: భర్త మరణ ధ్రువీకరణ పత్రం
  • ఒంటరి మహిళలు: సెపరేషన్ సర్టిఫికెట్ లేదా స్థానిక విచారణ నివేదిక.
  • గీత కార్మికులు: ఎక్సైజ్ శాఖ ధ్రువీకరణ.
  • చేనేత కార్మికులు: చేనేత-జౌళి శాఖ ధ్రువీకరణ.
  • వ్యాధిగ్రస్తులు – ఫైలేరియా బాధితులు: వైద్య ఆరోగ్య శాఖ ధ్రువీకరణ పత్రాలు.

దరఖాస్తుల పరిశీలన – పంపిణీ ప్రక్రియ..

చివరి తేదీ: కొత్త పింఛన్ల కోసం అర్హులైన వారు ఆగస్టు 31 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

పోర్టల్‌లో నమోదు: దరఖాస్తులు స్వీకరించిన వెంటనే వివరాలను చేయూత ఆన్‌లైన్ పోర్టల్‌లో అప్‌లోడ్ చేస్తారు.

ఐకేపీ, ఎస్‌హెచ్‌జీల సహాయం: వితంతువులు, ఒంటరి మహిళలు దరఖాస్తు చేసుకోవడంలో సర్టిఫికెట్లు పొందడంలో స్వయం సహాయక సంఘాల సమాఖ్యలు సహాయపడతాయి.

కలెక్టర్ల ఆమోదం: క్షేత్రస్థాయిలో అధికారులు వచ్చి విచారణ జరిపిన అనంతరం అర్హుల జాబితాను జిల్లా స్థాయికి పంపుతారు. అక్కడి నుంచి కలెక్టర్ ఆమోదం తెలిపిన వెంటనే పింఛన్ మంజూరు అవుతుంది.

కాగా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ పారదర్శకంగా పథకాలు అందించడమే ప్రభుత్వ ధ్యేయమని, ఎలాంటి మధ్యవర్తులను నమ్మవద్దని అధికారులు సూచించారు.

Loading...
Unable to load recommendations.
Follow Us