
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల సందడి నెలకొంది. తొలుత ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఆ తర్వాత సర్పంచ్ ఎన్నికలు జరగనున్నాయి. రెండు విడుతల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో తొలి విడుత ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. నేటి నుంచి నామినేషన్లను స్వీకరిస్తున్నారు. ఈ నెల 11న నామినేషన్లకు చివరి తేదీ. ఈనెల 12న నామినేషన్ల పరిశీలన ఉండగా.. ఈ నెల 15 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఇచ్చారు.
ఈనెల 23న మొదటి విడత ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో గ్రామాల్లో హడావుడి మొదలైంది. మొదటి విడతలో 292 జడ్పీటీసీ, 2963 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఎంపీటీసీలకు మండల కార్యాలయాల్లో, జడ్పీటీసీ అభ్యర్థులకు జిల్లా కార్యాలయాల్లో నామినేషన్లు స్వీకరిస్తున్నారు. మిగితా స్థానాలకు రెండో విడతలో ఎన్నికలు జరగనున్నాయి. కాగా రెండో విడత ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ అక్టోబర్ 27న జరగనుంది. దీనికి సంబంధించి అక్టోబర్ 13న నామినేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. అక్టోబర్ 16న నామినేషన్ల పరిశీలన, అక్టోబర్ 19 వరకు నామినేషన్ల విత్ డ్రాకు అవకాశం కల్పించారు. నవంబర్ 11న రెండు విడతలకు సంబంధించిన ఫలితాలు వెల్లడికానున్నాయి.
ఇదిలా ఉండగా ఎన్నికల సంఘం అభ్యర్థుల ఖర్చు పరిమితిని కూడా ఖరారు చేసింది. జెడ్పీటీసీ అభ్యర్థి రూ. 4 లక్షలు ఖర్చు చేయవచ్చు. ఎంపీటీసీ అభ్యర్థి రూ.1.50 లక్షల వరకు ఖర్చు చేయడానికి వీలుంటుంది. ఇక సర్పంచ్ అభ్యర్థి గరిష్టంగా రూ. 2.50 లక్షలు ఖర్చు చేయొచ్చు. ఈ నిబంధనలు దాటితే అభ్యర్థులు మూడేళ్లపాటు పోటీకి అనర్హులు అవుతారు లేదా గెలిచినా పదవిని కోల్పోతారు. అభ్యర్థులు ఎన్నికల ఫలితాలు వెల్లడైన తేదీ నుంచి 45 రోజులలోపు ఖర్చుల తుది నివేదికను సమర్పించాలి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..