Telangana: తెలంగాణ రైతులకు రేవంత్ సర్కార్ శుభవార్త.. రేపటి నుంచే అమల్లోకి.. రెడీగా ఉండండి..

రైతులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త అందించింది. ఇంటిగ్రేటెడ్ భూభారతి పోర్టల్‌ను తీసుకొచ్చింది. ఏప్రిల్ 2 నుంచి ప్రయోగాత్మకంగా కొన్ని జిల్లాల్లో అమలు చేయనుంది. ఆ తర్వాత విడతల వారీగా అన్ని జిల్లాల్లో అమలు చేయాలని నిర్ణయించారు. దీంతో రేతులకు ఎంతో ప్రయోజనం కలగనుంది.

Telangana: తెలంగాణ రైతులకు రేవంత్ సర్కార్ శుభవార్త.. రేపటి నుంచే అమల్లోకి.. రెడీగా ఉండండి..
Telangana Farmers

Edited By:

Updated on: Apr 01, 2026 | 7:20 PM

తెలంగాణలో భూ వివాదాలతో సంవత్సరాలుగా ఇబ్బందులు పడుతున్న రైతులకు ఊరట కలిగించే దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ల్యాండ్‌, సర్వే, రిజిస్ట్రేషన్ సేవలను ఒకే వేదికపైకి తీసుకొచ్చేలా ‘సమీకృత భూభారతి పోర్టల్’ను సిద్ధం చేసింది. ఈ పోర్టల్‌ను ఏప్రిల్‌ 2 నుంచి ఖమ్మం జిల్లా కుసుమంచి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట, రంగారెడ్డి జిల్లా అమన్‌గల్‌, సంగారెడ్డి జిల్లా వట్‌పల్లి, నారాయణపేట జిల్లా కొస్గి మండలాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నారు. రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించిన వివరాల ప్రకారం.. రైతులకు సులభంగా, పారదర్శకంగా భూ సేవలు అందించడమే ఈ పోర్టల్ లక్ష్యం. ఇప్పటివరకు భూ సేవల కోసం మీ సేవ కేంద్రాలు, రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితిని తగ్గించి, ఇంటి నుంచే సేవలు పొందేలా ఈ వ్యవస్థను రూపొందించారు. రైతు లాగిన్ అయిన వెంటనే తన భూమికి సంబంధించిన పూర్తి వివరాలు కనిపించేలా సాంకేతిక వ్యవస్థను ఏర్పాటు చేశారు.

భూమి సర్వే కోసం రైతు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంటే.. సంబంధిత ఫీజు వివరాలు వెంటనే చూపిస్తుంది. ఫీజు చెల్లించిన తర్వాత ఆ సమాచారం లైసెన్స్‌డ్ సర్వేయర్‌కు చేరుతుంది. ఆపై రెండు రోజుల్లో పొరుగు రైతులకు నోటీసులు జారీ చేసి, వారం రోజుల్లో సర్వే తేదీ నిర్ణయిస్తారు. ఆధునిక ‘రోవర్లు’ సాయంతో సర్వే నిర్వహించి, ఖచ్చితమైన వివరాలను నమోదు చేస్తారు. సర్వే పూర్తయిన తర్వాత ఆ వివరాలు మండల సర్వేయర్ పరిశీలనకు వెళ్లి, తహశీల్దార్ ఆమోదం పొందిన అనంతరం రైతుకు ఎల్‌పిఎమ్ నంబర్‌తో పాటు భూధార్ నంబర్ కేటాయిస్తారు. ఈ వివరాలన్నీ భూభారతి పోర్టల్‌లో నిక్షిప్తం అవుతాయి. సర్వే మ్యాప్‌ను కూడా జనరేట్ చేసి పోర్టల్‌లో అప్‌లోడ్ చేస్తారు. దరఖాస్తు నుంచి సర్వే పూర్తయ్యే వరకు ప్రతి దశలో రైతు మొబైల్‌కు ఎస్‌ఎంఎస్ ద్వారా సమాచారం అందేలా చర్యలు తీసుకున్నారు.

వ్యవసాయ భూముల కొనుగోలు, అమ్మకాల సమయంలో సర్వే మ్యాప్ జతపరచడం తప్పనిసరి చేసే నిబంధనను ఈ పైలట్ మండలాల్లో అమలు చేయనున్నారు. ప్రతి సర్వే మ్యాప్‌కు ప్రత్యేక నంబర్ ఇవ్వడమే కాకుండా ప్రతి భూమికి ఆధార్ తరహాలో భూధార్ నంబర్ కేటాయించడం ద్వారా భవిష్యత్తులో వివాదాలకు తావు లేకుండా చూడాలని ప్రభుత్వం భావిస్తోంది. పాత పద్ధతులైన గొలుసులు, కర్రలు, టేపులతో చేసే సర్వేలకు స్వస్తి చెప్పి, ఆధునిక సాంకేతికతను ఉపయోగించడం వల్ల సర్వే ప్రక్రియ వేగంగా పూర్తవడమే కాకుండా ఖచ్చితత్వం పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు. మొత్తంగా చూస్తే.. భూ సమస్యలు రైతు జీవితంలో పెద్ద అడ్డంకిగా మారిన ఈ సమయంలో, సమీకృత భూభారతి పోర్టల్ ద్వారా పారదర్శకత పెంచి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఈ ప్రయోగం విజయవంతమైతే రాష్ట్రంలో భూ వ్యవహారాల్లో భారీ మార్పు చోటుచేసుకునే అవకాశముంది.

Follow Us