ఎన్నికల వేడి చల్లారకముందే పదవుల పంచాయితీ .. నామినేటెడ్‌ పదవులపై ఆశలు పెట్టుకున్న కీలక నేతలు

| Edited By: Rajeev Rayala

Dec 19, 2023 | 9:59 PM

నామినేటెడ్‌, ఎమ్మెల్సీ పదవుల కోసం తీవ్ర పోటీ నెలకొంది. మరికొందరు ఎమ్మెల్సీ కోటాలో మంత్రులు కావాలని ఆరాటపడుతున్నారు. అంతటితో ఆగకుండా గల్లీ నుంచి ఢిల్లీ దాకా చేయని ప్రయత్నాలు లేవు. తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ కొన్ని స్థానాల్లో మైనార్టీ నేతలకు టికెట్లు కేటాయించినా అక్కడ ఆ పార్టీ అభ్యర్థులు గెలవలేకపోయారు.

ఎన్నికల వేడి చల్లారకముందే పదవుల పంచాయితీ .. నామినేటెడ్‌ పదవులపై ఆశలు పెట్టుకున్న కీలక నేతలు
Cm Revanth Reddy
Follow us on

కొత్తగా వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వంలో తమకు నామినేటెడ్‌ పదవులు దక్కుతాయని మైనార్టీ నేతలంతా క్యూ కడుతున్నారు. నామినేటెడ్‌, ఎమ్మెల్సీ పదవుల కోసం తీవ్ర పోటీ నెలకొంది. మరికొందరు ఎమ్మెల్సీ కోటాలో మంత్రులు కావాలని ఆరాటపడుతున్నారు. అంతటితో ఆగకుండా గల్లీ నుంచి ఢిల్లీ దాకా చేయని ప్రయత్నాలు లేవు. తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ కొన్ని స్థానాల్లో మైనార్టీ నేతలకు టికెట్లు కేటాయించినా అక్కడ ఆ పార్టీ అభ్యర్థులు గెలవలేకపోయారు. దీంతో ఆయా నేతలు నామినేటెడ్‌ పదవులపై కన్నేశారు. హజ్‌ కమిటీ, వక్ఫ్‌బోర్డ్‌తో పాటు మైనార్టీలకు చెందిన పదవుల కోసం కాంగ్రెస్‌ పెద్దల చుట్టూ తిరుగుతున్నారు. ఇందులో ప్రధానంగా వక్ఫ్‌బోర్డ్‌ పదవులపైనే తీవ్ర పోటీ నెలకొంది. అయితే కాంగ్రెస్‌ అధిష్టానం ఎవరికి నామినేటెడ్‌ పదవులను కట్టబెడుతుందా అన్నది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

మరోవైపు ఆశావహులు మాత్రం గల్లీ స్థాయి నుంచి ఢిల్లీలోని అధిష్టానం పెద్దల వరకు తమకున్న పలుకుబడి ఉపయోగించి నామినేటెడ్‌ పదవుల కోసం తమవంతు ప్రయత్నాలు జోరుగా సాగిస్తున్నారు. కాంగ్రెస్‌ నేతలు అప్పటికే మైనార్టీలకు ముస్లింలు ఎక్కువగా ప్రాంతాల్లో టికెట్లు ఇచ్చినా గెలవలేదు. దీంతో అక్కడ పోటీ చేసిన బడా నేతల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. కనీసం నామినేటెడ్‌ పోస్టులు అయినా దక్కుతాయని ఎదురుచూస్తున్నారు. అయితే ఎంఐఎం నేతలు మాత్రం కాంగ్రెస్‌తో పాటు గత ప్రభుత్వం బీఆర్‌ఎస్‌పైనా విమర్శలు గుప్పిస్తోంది. పదవుల కోసం ఒకప్పుడు బీఆర్‌ఎస్‌లోకి వెళ్లారని, ఇప్పుడు కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే ఇందులోకి మారుతున్నారంటూ ఎద్దేవా చేస్తోంది. ఎవరు ఏ పార్టీలోకి వెళ్లినా ఒక్క ముస్లిం నేతను కూడా గెలిపించుకోలేకపోయారంటూ సెటైర్లు వేస్తున్నారు. తాము మాత్రం ఏడు సిట్టింగ్‌ స్థానాల్లో బలంగా ఉన్నామని, ఆయా సీట్లను తిరిగి కైవసం చేసుకున్నామంటూ ధీమా వ్యక్తం చేస్తోంది.

అయితే కాంగ్రెస్‌ మాత్రం ఒక్కసీటు గెలవలేకపోయామన్న డైలామాలో ఉండగా..ఇప్పుడు కొత్తగా నామినేటెడ్‌ పోస్టుల తలనొప్పి పట్టుకుంది. ఎవరికి ఇస్తే ఏ తంట వస్తుందోనని, ఎవరికి ఏ పదవి ఇవ్వాలో తెలియక తికమకమవుతోంది. మరోవైపు ఢిల్లీ స్థాయిలో నామినేటెడ్‌ పదవులపై పైరవీలు, డిమాండ్లు వస్తుండటంతో ఏం చేయాలో తెలియక అయోమయంలో రాష్ట్ర నాయకత్వం పడినట్టు చెబుతున్నారు. అయితే నామినేటెడ్‌ పదవుల కోసం ఆశావహుల లిస్ట్‌ మాత్రం గల్లీ నుంచి ఢిల్లీ వరకు పెరిగిపోయింది. చిన్న చిన్న నేతలు కూడా కాంగ్రెస్‌ అధిష్టానం నుంచి రికమండేషన్లు చేయించడంతో ఎవరికి నామినేటెడ్‌ పదవులు, ఎమ్మెల్సీ పదవులు దక్కుతాయా అన్నది ప్రశ్నార్థకంగా మారింది.