Governor Delhi Tour: మళ్లీ ఢిల్లీకి వెళ్లిన గవర్నర్ తమిళిసై.. రేపు మరోసారి ప్రధాని మోదీ, అమిత్‌ షాతో భేటీకి ఛాన్స్!

|

Apr 17, 2022 | 7:53 PM

తాజాగా మరోసారి ఢిల్లీకి వెళ్లారు గవర్నర్ తమిళిసై. సోమవారం ప్రధాని, కేంద్ర మంత్రులను మరోసారి కలిసే అవకాశం వుందని తెలుస్తోంది.

Governor Delhi Tour: మళ్లీ ఢిల్లీకి వెళ్లిన గవర్నర్ తమిళిసై.. రేపు మరోసారి ప్రధాని మోదీ, అమిత్‌ షాతో భేటీకి ఛాన్స్!
Telangana Governor Tamilisa
Follow us on

Governor Tamilisai Delhi Tour: తెలంగాణ(Telangana) రాజకీయాలు మళ్లీ ఢిల్లీ కేంద్రంగా హీటెక్కాయి. మరోసారి ఢిల్లీ పర్యటన(Delhi Tour)కు గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్(Tamilisai Soundararajan) వెళ్లడంతో రాజకీయ వర్గాల్లో హాట్‌టాఫిక్‌గా మారింది. పది రోజుల క్రితం ఢిల్లీ వెళ్లిన ఆమె ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలతో పాటు ప్రభుత్వం తనపై వ్యవహరిస్తున్న తీరును, ప్రోటోకాల్ వివాదంపైనా అధిష్టానం పెద్దలకు నివేదిక సమర్పించారు.

అయితే తాజాగా మరోసారి ఢిల్లీకి వెళ్లారు గవర్నర్ తమిళిసై. తన ఢిల్లీ పర్యటనలో కేంద్ర సహాయమంత్రి జితేందర్ సింగ్ కుమారుడి వివాహానికి హాజరు కానున్నారు. ఈ క్రమంలోనే సోమవారం ప్రధాని, కేంద్ర మంత్రులను మరోసారి కలిసే అవకాశం వుందని తెలుస్తోంది. ఇప్పటికే రాజ్ భవన్, ప్రగతి భవన్ ల మధ్య పెరుగుతున్న దూరం నేపథ్యంలో కేంద్రంతో ఆమె ఏయే విషయాలు చర్చిస్తారనేది ఆసక్తిగా మారింది. గత పర్యటనలో మోదీ, అమిత్ షాలతో భేటీ తర్వాత ఆమె చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. తెలంగాణ మంత్రులతో సహా టీఆర్ఎస్ నేతలు ఒక్కొక్కరిగా ఆమె వ్యాఖ్యలను ఖండించారు. కొందరైతే అసలు గవర్నర్ వ్యవస్థనే రద్దు చేయాలంటూ డిమాండ్ చేశారు.

మొన్నటి హస్తిన పర్యటన తర్వాత గవర్నర్ భద్రాద్రి కొత్తగూడెం పర్యటనకు వెళ్లగా అక్కడా అధికారులు వ్యవహారించిన తీరు మరింత అజ్యం పోసింది. శ్రీరామనవమి వేడుకల్లోభాగంగా సీతా రాముల పట్టాభిషేకం కార్యక్రమానికి హాజరైన గవర్నర్ కు మరోసారి ప్రోటోకాల్ సమస్య తలెత్తింది. అయితే ఇవన్నీ పట్టించుకోని గవర్నర్ రెండ్రోజుల పాటు జిల్లాలోని వివిధ కార్యక్రమాల్లో పాల్గొని తిరిగి రాజ్‌భవన్‌కు వచ్చేశారు.

మరోవైపు పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఉన్న తమిళిసై ఆ రాష్ట్రంలోనూ అలాంటి అనుభవమే ఎదురైంది. అయితే అక్కడ అధికార పక్షం కాకుండా.. విపక్షం ఆమె ఆహ్వానాన్ని తిరస్కరించింది. తెలుగు రాష్ట్రాల్లో ఉగాది మాదిరిగానే పుదుచ్చేరిలోనూ తమిళ సంవత్సరాది ‘చిత్తిరూ నిలవు’ పండగ జరుపుకుంటారు. ఈ సందర్భంగా గవర్నర్ తమిళిసై పుదుచ్చేరిలో విందు ఏర్పాటు చేశారు. ఆ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రంగస్వామి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. అయితే గవర్నర్ విందుకు ప్రతిపక్ష పార్టీలైన డీఎంకే, కాంగ్రెస్ పార్టీలు గైర్హాజరయ్యాయి. ఇంఛార్జి లెప్టినెంట్ గవర్నర్‌గా రాజ్యాంగబద్దమైన హోదాలో వున్న తమిళిసై తన పరిధి దాటి వ్యవహరిస్తూ రాజకీయాలు చేస్తున్నారంటూ ఆరోపిస్తూ ప్రతిపక్షాలు ఈ విందును బహిష్కరించాయి.

తాజాగా ఈ నేపథ్యంలోనే తమిళిసై ఢిల్లీ పర్యటన ఆసక్తిగా మారింది. రెండు రాష్ట్రాల్లో తనకు ఎదురవుతున్న పరాభవాలను మళ్లీ కేంద్రం దృష్టికి తీసుకెళ్తారా?.. లేదా? అన్నది చర్చనీయాంశంగా మారింది.

Read Also…  Anilkumar Yadav: నా రక్తం లో జగన్ నామస్మరణ తప్ప ఏమీ వుండదు.. వచ్చే విడతలో నేనే మంత్రిః అనిల్ కుమార్