
మహిళలకు తులం బంగారం పథకంపై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. గత ఎన్నికల మేనిఫెస్టోలో మహిళలకు తులం బంగారం అందిస్తామంటూ కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఆరు గ్యారెంటీల్లో భాగంగా ఈ హామీ ప్రకటించింది. కానీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటినా ఆ పథకంపై రేవంత్ సర్కార్ ముందడుగు వేయడం లేదు. కనీసం దాని అమలుపై ఎలాంటి ప్రకటన ఇప్పటివరకు చేయలేదు. దీంతో తులం బంగారం పథకం ఎప్పుడు అమలు చేస్తారంటూ ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాయి. పదే పదే ఆ అంశాన్ని గుర్తు చేస్తున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వం స్పందించి క్లారిటీ ఇచ్చింది.
త్వరలోనే తులం బంగారం పథకాన్ని అమలు చేయనున్నట్లు ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రకటన చేశారు. ఆరు గ్యారెంటీల్లో భాగంగా ఇచ్చిన ప్రతీ హామీని నెరవేర్చేందుకు సిద్దంగా ఉన్నామని, త్వరలో కళ్యాణలక్ష్మితో పాటు తులం బంగారం పథకాన్ని ప్రవేశపెట్టనున్నట్లు స్పష్టతిచ్చారు. ఐదేళ్ల పదవీకాలంలోపు ప్రతీ హామీని అమలు చేస్తామని తెలిపారు. అధికారంలోకి రాగానే మెజార్టీ హామీలను నెరవేర్చామని, మిగతావి కూడా త్వరలోనే అమలు అవుతాయన్నారు. పథకాలన్నీ అమలు చేశాకే ప్రజల వద్దకు వెళ్తామని అన్నారు. ఆరు గ్యారెంటీల అమలుపై సీఎం రేవంత్ రెడ్డికి కేంద్రమంత్రి బండి సంజయ్ సవాల్ విసిరారు. దీనిపై శ్రీధర్ బాబు స్పందించి.. పై విధంగా వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ 420 హామీలు ఇచ్చిందని ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయని, తాము అలాంటివి ఇవ్వలేదన్నారు. ప్రతిపక్షాలు తప్పుద్రోవ పట్టించాలనే ప్రవర్తిస్తున్నాయని శ్రీధర్ బాబు విమర్శించారు.
గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ 100 శాతం నెరవేరుస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఆచరణ యోగ్యమైన హామీలు, పథకాలు అమలు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. ప్రజలను ఎలా పక్కదారి పట్టించాలనే జిమ్మిక్కులు బీఆర్ఎస్, బీజేపీకి బాగా తెలుసన్నారు. తమ ప్రభుత్వం చేస్తున్న అభివృద్దిని తట్టుకోలేక ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయన్నారు. రేవంత్ రెడ్డి, సీనియర్ మంత్రులకు మధ్య అనేక విబేధాలు ఉన్నాయనే ప్రచారంలో వాస్తవం లేదన్నారు. సీఎంతో సమన్వయం చేసుకుంటూ కేబినెట్ మంత్రులందరూ ముందుకెళ్తున్నారని శ్రీధర్ బాబు అన్నారు.