Mahabubabad: ‘అమ్మా, నాన్న.. మేము ఏం పాపం చేశాం’ ఇద్దరు చిన్నారులను హతమార్చి పరారైన కన్నోళ్లు!
మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం అంకన్నగూడెంలో ఆదివారం (మార్చి 10) విషాదం చోటు చేసుకుంది. ఇద్దరు చిన్నారులు అనుమానాస్పదస్థితిలో మృతి చెందారు. వారు తాగే పాలలో విషం కలిపి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు మృతి చెందిన చిన్నారుల తల్లిదండ్రులు పరారీలో ఉన్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
మహబూబాబాద్, మార్చి 10: మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం అంకన్నగూడెంలో ఆదివారం (మార్చి 10) విషాదం చోటు చేసుకుంది. ఇద్దరు చిన్నారులు అనుమానాస్పదస్థితిలో మృతి చెందారు. వారు తాగే పాలలో విషం కలిపి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు మృతి చెందిన చిన్నారుల తల్లిదండ్రులు పరారీలో ఉన్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
బయ్యారం మండలం నామాలపాడులో అనిల్, దేవి దంపతులు నివాసం ఉంటున్నారు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు. పెద్ద అమ్మాయి లోహిత(3), ఏడాది వయసున్న జశ్విత ఉన్నారు. వారం రోజుల క్రితం అనిల్ తన భార్యాపిల్లలతో కలిసి తన స్వగ్రామం అయిన అంకన్నగూడెంకు వచ్చాడు. అనిల్ తండ్రి వెంకన్న స్థానికంగా కిరాణా దుకాణం నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే ఆదివారం తెల్లవారుజామున షాపునకు వెళ్లిన వెంకన్న.. తిరిగి 10 గంటలకు ఇంటికి చేరుకున్నాడు. అప్పటికే ఇంట్లో ఇద్దరు చిన్నారులు విగతజీవులుగా పడి ఉండటం వెంకన్న గమనించాడు. మరోవైపు కుమారుడు, కోడలు కనిపించలేదు. దీంతో ఆందోళనకు గురైన వెంకన్న వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. చిన్నారుల పక్కనే ఖాళీ పాల గ్లాసులు ఉండటంతో చిన్నారులకు విషయం ఇచ్చి తల్లిదండ్రులు అనిల్, దేవి హత్య చేసి ఉంటారని భావించారు.
సమాచారం అందుకున్న పోలీసులు, అంకన్నగూడెం చేరుకుని చిన్నారుల మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అనిల్, దేవి మధ్య వాగ్వాదం జరగడంతో పిల్లలకు విషమిచ్చి హత మార్చి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. చిన్నారుల తల్లిదండ్రుల ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.