KCR Sagar Tour: మరికాసేపట్లో నాగార్జున సాగర్‌కు సీఎం కేసీఆర్‌.. హామీల అమలు, పనుల పురోగతి, సమస్యలపై సమీక్ష

|

Aug 02, 2021 | 9:21 AM

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కాసేపట్లో నల్గొండ జిల్లా నాగార్జునసాగర్‌లో పర్యటిస్తారు. పల్లెప్రగతి సమీక్షపై నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి కార్యకమాలపై సమీక్ష జరపనున్నారు.

KCR Sagar Tour: మరికాసేపట్లో నాగార్జున సాగర్‌కు సీఎం కేసీఆర్‌.. హామీల అమలు, పనుల పురోగతి, సమస్యలపై సమీక్ష
Cm Kcr Nagarjuna Sagar Tour
Follow us on

CM KCR Nagarjunasagar Tour: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కాసేపట్లో నల్గొండ జిల్లా నాగార్జునసాగర్‌లో పర్యటిస్తారు. పల్లెప్రగతి సమీక్షపై నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి కార్యకమాలపై సమీక్ష జరపనున్నారు. ఉప ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుపై ప్రధానంగా చర్చిస్తారు. ఇప్పటి వరకు చేపట్టిన పనులతో పాటు పెండింగ్‌లో ఉన్న సమస్యలపై చర్చించనున్నారు. హాలియాలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో నాగార్జున సాగర్‌ నియోజకవర్గ అభివృద్ధిపై అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు.

నాగర్జున సాగర్‌ ఉప ఎన్నికల్లో సమయంలో కేసీఆర్‌ నియోజకవర్గానికి వరాల జల్లు కురిపించారు. అయితే అవి ఏ మేరకు అమలు అవుతున్నాయి. ఇంకా సమస్యలు ఏంటీ. పెండింగ్‌లో ఉన్న అంశాలపైనా రివ్యూ చేస్తారు. పోడుభూములు, నెల్లికల్‌లిఫ్ట్‌, డిగ్రీకాలేజీ, గ్రామపంచాయతీకి నిధులు వంటివి ప్రధానంగా ఉండనున్నాయి. హాలియాలో అధికారులు, ప్రజాప్రతినిధులు, వివిధ వర్గాల ప్రముఖులతో ప్రగతిపై సమీక్ష నిర్వహించనున్నారు. ఉప ఎన్నికల సమయంలో నాగార్జునసాగర్‌ నియోజకవర్గంలో మిగిలి ఉన్న అభివృద్ధి అంశాలను నెరవేరుస్తామని అప్పట్లో కేసీఆర్‌ హామీ ఇచ్చారు. ఈ మేరకు సమస్యలపై చర్చించి, తగిన నిర్ణయాలు తీసుకుని, అక్కడికక్కడే ఆదేశాలు ఇచ్చేందుకు కేసీఆర్‌ వస్తున్నట్లు జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి చెప్పారు.

నేడు హాలియాకు కేసీఆర్ రావడంతో ఏర్పాట్లను జిల్లా కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌, డీఐజీ ఏవీ రంగనాథ్‌, నాగార్జున సాగర్‌ ఎమ్మెల్యే నోముల భగత్‌ పరిశీలించారు. హాలియా ప్రభుత్వ ఐటీఐలో అధికారులతో సమీక్ష నిర్వహించేందుకు వీలుగా చేయాల్సిన ఏర్పాట్లపై కలెక్టర్‌ అధికారులతో చర్చించారు. హెలీపాడ్‌ ఏర్పాట్లపై కూడా చర్చించారు. అనంతరం కలెక్టర్‌ హాలియా పట్టణంలో పర్యటించి మున్సిపల్‌ కమిషనర్‌కు పలు సూచనలు చేశారు. పారిశుధ్యాన్ని మెరు గుపర్చాలని, ఎన్నెస్పీ కెనాల్‌ వెంట మొక్కలు నాటాలని ఆదేశించారు.

హామీల అమలు, పనుల పురోగతి, సమస్యలపై సమీక్ష నిర్వహించడానికి సీఎం కేసీఆర్‌ వస్తుండటంతో మూడు రోజులుగా అధికార యంత్రాంగం సాగర్‌ నియోజకవర్గంలోని సమస్యలను గుర్తించే పనిలో నిమగ్నమైంది. జిల్లా ఉన్నతాధికారులు, అన్ని శాఖల హెచ్‌వోడీలు, తహసీల్దార్లు అక్కడే మకాం వేసి నివేదికలను రూపొందిస్తున్నారు. ఎజెండా ఇప్పటికీ చేరకపోవడంతో సీఎం ఏ అంశంపై చర్చిస్తారోనని పలువురు ఆందోళన చెందుతున్నారు.

నియోజకవర్గంలో ఆరు మండలాలు, రెండు మునిసిపాలిటీలు ఉండగా ప్రతి గ్రామం నుంచి 10మంది ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రి సమీక్ష సమావేశానికి హాజరయ్యేలా ఆహ్వానాలు పంపారు. అందులో సర్పంచ్‌లు, ఎంపీటీసీ లు, జడ్పీటీసీలు, ఆర్‌ఎ్‌సఎస్‌ సభ్యులు, పీఏసీఎస్‌ చైర్మ న్లు, గొర్రెల కాపర్ల సంఘం అధ్యక్షులతో పాటు ఎమ్మెల్యే లు, అధికారులు పాల్గొంటారు.

ముఖ్యమంత్రి కేసీఆర్‌ హాలియాకు రావడం వల్ల నాగార్జునసాగర్‌ నియోజకవర్గ అభివృద్ధి కొత్త మలుపు తిరుగనున్నదని ఎమ్మెల్యే నోముల భగత్‌ అన్నారు. సాగర్‌ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా ఏప్రిల్‌ 14న హాలియాలో నిర్వహించిన బహిరంగ సభలో సీఎం ఇచ్చిన హామీ మేరకు నేడు వస్తున్నారని ఆయన తెలిపారు. ఇప్పటికే హాలియాకు డిగ్రీ కళాశాల, నెల్లికల్లు లిఫ్ట్‌ మంజూరు చేయడంతో పాటు ప్రతి గ్రామ పంచాయతీకి 20 లక్షలు, మున్సిపాలిటీకి 30 లక్షలు, మున్సిపాలిటీకి కోటి చొప్పున విడుదల చేసినట్లు చెప్పారు. ప్రస్తుతం సీఎం కేసీఆర్‌ స్వయంగా వచ్చి సమీక్ష చేయడం వల్ల నియోజకవర్గ సమస్యలన్నీ పరిష్కారం కానున్నాయని తెలిపారు.

Read Also…  Swim death: తీవ్ర విషాదం.. ఆరుగురు మిత్రులు అప్పటివరకు సరదా గడిపారు.. అంతలోనే ముగ్గురు విగతజీవులుగా మారారు..!