
తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా 1.28 లక్షల మంది పింఛన్లను రద్దు చేసింది. అధికారుల పరిశీలనలో అనర్హులుగా తేలడంతో క్యాన్సిల్ చేసింది. అనర్హులను గుర్తించేందుకు అధికారులు వెరిఫికేషన్ ప్రక్రియ చేపడుతున్నారు. క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలన చేపడుతున్నారు. లబ్ది పొందుతున్నవారికి నిజంగా అర్హత ఉందా..? లేదా? అనే విషయాలను తెలుసుకుంటున్నారు. ఈ వెరిఫికేషన్ ప్రక్రియలో చాలామందికి అర్హత లేకపోయినా అడ్డదారిలో పింఛన్లు పొందుతున్నట్లు తేలింది. దీంతో వీరికి పింఛన్లను కట్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వెరిఫికేషన్ ప్రక్రియ ఎప్పుడూ కొనసాగుతూనే ఉంటుందని అధికారులు చెబుతున్నారు.
మరణించినవారి పేర్లతో పాటు ప్రస్తుతం గ్రామాల్లో అందుబాటులో లేనివారు, ఇతర ప్రాంతాలకు వలస వెళ్లినవారు, ఐదు ఎకరాలకుపైగా పొలం ఉన్నవారు, పన్ను చెల్లింపుదారులు, ప్రభుత్వ ఉద్యోగుల తల్లిదండ్రులు ఉన్నారు. మొత్తం 1.28 లక్షల పింఛన్లను తొలగించగా.. ఇందులో 1.02 లక్షల మంది గ్రామాల్లో ఉంటున్నారు. ఇక మిగిలిన 26 వేల పింఛన్లు మున్సిపాల్టీల పరిధిలో ఉన్నాయి. గ్రామాల్లో ఎక్కువమంది అర్హత లేకపోయినా పింఛన్లను పొందుతున్నట్లు అధికారుల విచారణలో తేలింది. కేవలం అనర్హులను మాత్రమే తొలగించామని, అర్హులకు ఎప్పటిలాగే నిధులు అందుతాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. అలాగే కొత్త పింఛన్ల కోసం చాలామంది ఎదురుచూస్తున్నారు. ఇలాంటివారికి ప్రభుత్వం సూపర్ న్యూస్ తెలిపింది. త్వరలోనే కొత్త పింఛన్లను మంజూరు చేయనున్నట్లు స్పష్టం చేసింది.
పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్నవారి వివరాలను పరిశీలించారు. వారిలో మొత్తం 48 వేల మందిని ఎంపిక చఏశారు. వీరికి త్వరలోనే పింఛన్లను అందించనున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే అర్హులైన జాబితాను సిద్దం చేయగా.. ఇందులో వికలాంగులు, వితంతవులు ఎక్కువగా ఉన్నారు. అర్ధికశాఖ నుంచి అనుమతి రావాల్సిన అవసరం ఉందని, ఆమోదం లభించాక నిధులను విడుదల చేస్తామని తెలిపారు. అయితే అనర్హులను తొలగించడం వల్ల రాష్ట్ర ఖజానాపై భారం తగ్గుతుంది. దీంతో పాటు కొత్తగా అర్హులైనవారికి అందించడానికి నిధుల కొరత ఉండదు. రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ పలుకుబడి, అధికారులకు లంచాలు ఇచ్చి చాలామందికి అర్హత లేకపోయినా పింఛన్లను పొందుతున్నారు. దీని వల్ల నిజమైన అర్హులకు నష్టం జరుగుతుంది. దీంతో అధికారులు సమగ్ర వెరిఫికేషన్ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ప్రతీ పింఛన్దారుడి అర్హతలను పరిశీలిస్తున్నారు. నిజంగా అర్హత ఉందా.. లేదా దొంగదారిలో పొందుతున్నారా అనే విషయాలు తెలుసుకుంటున్నారు. అనర్హులు అని తేలితే వెంటనే లబ్దిదారుల జాబితా నుంచి తొలగిస్తున్నారు. కాగా వచ్చే నెల నుంచి నేరుగా బ్యాంక్ అకౌంట్లలో పింఛన్ జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.