Telangana Assembly: కేసీఆర్ వస్తారా? కౌంటర్ ఇస్తారా? అసెంబ్లీ సమావేశాల్లో దానిపైనే ప్రధాన చర్చ..

ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల్లో కాళేశ్వరం నివేదికపైనే ఫోకస్ చేసింది తెలంగాణ ప్రభుత్వం. సభ సాక్షిగానే బీఆర్ఎస్ అవినీతి బయటపెడతామని కాంగ్రెస్ చెబుతుంటే.. అదే సభలో ప్రభుత్వం కుట్రలను తిప్పికొడతామంటోంది బీఆర్ఎస్.. దీంతో తెలంగాణ రాజకీయాలు మరోసారి హీటెక్కబోతున్నాయి.. ఈ నేపథ్యంలో ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలపై ఉత్కంఠ నెలకొంది.

Telangana Assembly: కేసీఆర్ వస్తారా? కౌంటర్ ఇస్తారా? అసెంబ్లీ సమావేశాల్లో దానిపైనే ప్రధాన చర్చ..
Telangana Assembly

Updated on: Aug 27, 2025 | 9:22 PM

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 30 (శనివారం) నుంచి ప్రారంభం కాబోతున్నాయి. మూడు నుంచి ఐదు రోజుల పాటు సమావేశాలు జరిగే అవకాశం ఉంది. కాళేశ్వరంపై కమిషన్ నివేదిక గురించి చర్చించడమే ప్రధాన అజెండా. అత్యంత కీలకమైన అంశం కావడంతో.. ఇరుపక్షాల మధ్య జరగబోయే వాడీవేడీ చర్చలు.. అసెంబ్లీని హీటెక్కించబోతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో నిర్ణయాలు తీసుకున్న తీరు.. మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగడంపై 16 నెలలపాటు విచారణ జరిపిన పీసీ.ఘోష్ కమిషన్.. జూలై 31న ప్రభుత్వానికి నివేదికను అందించింది. ఈ నివేదికపై ఇప్పటికే కేబినెట్‌లో చర్చ జరిగింది. అధికారులతో పాటు బీఆర్‌ఎస్‌లోని కీలక నేతలు బాధ్యులని తేలడంతో.. అసెంబ్లీలో చర్చించి.. అందరి నిర్ణయాలు తీసుకున్న తర్వాత ముందుకెళ్తామని ఇది వరకే సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. అసెంబ్లీలో ఈ అంశంపై ప్రభుత్వాన్ని నిలదీస్తామంటూ ఇప్పటికే హరీష్‌రావు కౌంటర్ ఇచ్చారు.

నివేదిక వచ్చినప్పుడే ఇరుపక్షాల మధ్య మాటల యుద్ధం..

నివేదిక వచ్చినప్పుడే ఇరుపక్షాల మధ్య మాటల యుద్ధం నడిచింది. ఇక ఆ నివేదికపై చర్చ అంటే.. పొలిటికల్ వైల్డ్ ఫైరే. మరోవైపు ఈ ప్రాజెక్ట్‌ విషయంలో అప్పటి సీఎం కేసీఆర్‌పైనే కాంగ్రెస్ ప్రధానంగా ఆరోపణలు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన అసెంబ్లీకి వస్తారా? ప్రభుత్వ ఆరోపణలు, విమర్శలకు కౌంటర్ ఇస్తారా? లేదా అనేది ఉత్కంఠగా మారింది.

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపైనా చర్చించే అవకాశం

ఇక.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపైనా అసెంబ్లీలో మరోసారి చర్చించాలని రేవంత్ సర్కార్ భావిస్తోంది. ఇప్పటికే అసెంబ్లీలో బీసీ బిల్లులను పాస్ చేసింది. మరోవైపు ఆర్డినెన్స్ తీసుకువచ్చింది. ఈ రెండు బిల్లులు కేంద్ర ప్రభుత్వం దగ్గర పెండింగ్‌లో ఉన్నాయి. అటు చూస్తే.. హైకోర్ట్ డెడ్‌లైన్ తరుముకొస్తోంది. కాబట్టి అసెంబ్లీ వేదికగా దీనిపై నిర్ణయం తీసుకునే ఆలోచనలో ఉంది ప్రభుత్వం. బీసీలకు రాజకీయంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు, విద్య, ఉద్యోగాలకు మరో బిల్లు అసెంబ్లీలో పెట్టాలని కాంగ్రెస్ భావిస్తోంది. మొత్తంగా అటు కాళేశ్వరం.. ఇటు బీసీలకు రిజర్వేషన్ల అంశంపై అసెంబ్లీ వాడీవేడిగా జరిగే అవకాశం ఉంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..