
పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా సంకల్పం గట్టిగా ఉంటే లక్ష్యం సాధ్యమే అని రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన పదవ తరగతి విద్యార్థి అమన్ రహమాన్ నిరూపించాడు. రోడ్డు ప్రమాదంలో కాలు, చేయి విరిగినా.. తన చదువు పట్ల ఉన్న పట్టుదలతో స్క్రైబ్ (లేఖరి) సహాయంతో పరీక్ష రాసి అందరికీ ఆదర్శంగా నిలిచాడు.
కొద్ది రోజుల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో సిరిసిల్ల పట్టణం సుభాష్ నగర్ కు చెందిన అమన్ రహమాన్ తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదంలో అతని కాలు, చేయి విరిగిపోవడంతో వైద్యులు సిమెంట్ ప్లాస్టర్ వేశారు. సాధారణ పరిస్థితుల్లో ఇలాంటి గాయాలతో చాలా మంది విద్యార్థులు పరీక్షలు వాయిదా వేసుకోవడం లేదా రాయకపోవడం జరుగుతుంది. కానీ అమన్ మాత్రం తన భవిష్యత్తు కోసం పరీక్షను తప్పక రాయాలని నిర్ణయించుకున్నాడు.
శారీరకంగా తీవ్రమైన నొప్పులు ఉన్నా కూడా చదువుపై ఉన్న అతని పట్టుదల ఏమాత్రం తగ్గలేదు. ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కూడా అమన్కు ధైర్యం చెప్పారు. అధికారుల అనుమతితో అతనికి స్క్రైబ్ (లేఖరి) సౌకర్యం కల్పించారు. దీంతో పరీక్ష సమయంలో స్క్రైబ్ అతని మాటలను విని సమాధానాలను రాసేలా ఏర్పాట్లు చేశారు.
ప్లాస్టర్ వేసిన కాలు, చేయితో పరీక్ష కేంద్రానికి చేరుకున్న అమన్ వీల్ చైర్ సహయంతో పరీక్ష హాల్లోకి వెళ్లి ప్రశ్నాపత్రాన్ని చూసి ఒక్కో ప్రశ్నకు సమాధానాలు చెప్పడం అక్కడున్న ఉపాధ్యాయులను, విద్యార్థులను కూడా ఆశ్చర్యానికి గురిచేసింది. నొప్పిని పట్టించుకోకుండా పరీక్షపై పూర్తి దృష్టి పెట్టిన అతని పట్టుదల అందరి ప్రశంసలు అందుకుంది. అమన్ సంకల్పం చూసిన స్థానికులు కూడా అతనిని అభినందిస్తున్నారు. పరిస్థితులు ఎంత కష్టంగా ఉన్నా లక్ష్యాన్ని వదులుకోకూడదనే సందేశాన్ని అమన్ తన చర్యలతో అందించాడు.. అని ఉపాధ్యాయులు చెబుతున్నారు.
వీడియో ఇక్కడ చూడండి..
ఒక చిన్న ప్రమాదం చాలా మందిని వెనక్కి తగ్గేలా చేస్తుంది. కానీ అదే ప్రమాదాన్ని సవాలుగా తీసుకుని ముందుకు సాగిన అమన్ రహమాన్ కథ ఇప్పుడు జిల్లాలో అందరికీ ప్రేరణగా మారింది. ప్లాస్టర్లో కాలు.. విరిగిన చేయి.. అయినా కూడా సంకల్ప దీక్షతో పరీక్ష రాసిన అమన్ రహమాన్ పట్టుదల నిజంగా అభినందనీయం..!
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..