Revanth Reddy: అది దక్షిణాదిపై కేంద్రం గురిపెట్టిన ఫైనల్ బుల్లెట్.. సీఎం రేవంత్ ఫైర్..

అభివృద్ధి చేసినందుకు మాకు ఇస్తున్న శిక్ష ఇదేనా? జనాభాను నియంత్రించినందుకు మా రాజకీయ ఉనికినే తుడిచేస్తారా? అంటూ సీఎం రేవంత్ రెడ్డి కేంద్రంపై ఫైర్ అయ్యారు. 50 శాతం సీట్ల పెంపు అనేది దక్షిణాదిపై కేంద్రం వదులుతున్న ఫైనల్ బుల్లెట్ అన్న ఆయన.. ఉత్తరాది పెత్తనాన్ని పెంచి, దక్షిణాది గళాన్ని నొక్కేసే కుట్ర అని విమర్శించారు.

Revanth Reddy: అది దక్షిణాదిపై కేంద్రం గురిపెట్టిన ఫైనల్ బుల్లెట్.. సీఎం రేవంత్ ఫైర్..
Revanth Reddy On Delimitation 2026

Updated on: Mar 24, 2026 | 8:46 PM

దేశంలో త్వరలో జరగబోయే నియోజకవర్గాల పునర్విభజన అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింద. ఢిల్లీలో జరుగుతున్న టీవీ9 వాట్ ఇండియా థింక్స్ టుడే సదస్సులో పాల్గొన్న ఆయన కేంద్రం తీరుపై మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న 50 శాతం సీట్ల పెంపు వ్యూహాన్ని రేవంత్ రెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు. కేవలం జనాభా ప్రాతిపదికన సీట్ల పెంపు జరిగితే దక్షిణాది రాష్ట్రాలు రాజకీయంగా నిర్వీర్యం అవుతాయని, ఇది దేశ సమాఖ్య స్ఫూర్తికే విరుద్ధమని ఫైర్ అయ్యారు. ప్రస్తుతం ఉన్న లెక్కల ప్రకారం సీట్లు పెంచితే.. తమిళనాడు, పుదుచ్చేరి కలిపి ఉన్న 40 స్థానాలు 60కి చేరుతాయి. కానీ అదే సమయంలో ఉత్తరప్రదేశ్‌లో సీట్ల సంఖ్య ఏకంగా 160కి పెరుగుతుందని అన్నారు. ఈ వ్యూహం వెనుక ఉన్న అసలు ఉద్దేశం దక్షిణాది రాష్ట్రాల అవసరం లేకుండానే కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అని రేవంత్ ఆరోపించారు. ‘‘50 శాతం పెంపు అనేది దక్షిణాది రాష్ట్రాల రాజకీయ ఉనికిపై కేంద్రం వదులుతున్న ఫైనల్ బుల్లెట్’’ అని ఆయన అభివర్ణించారు.

అభివృద్ధికి శిక్షా? జనాభా నియంత్రణే శాపమా?

దక్షిణాది రాష్ట్రాలు దశాబ్దాలుగా కేంద్రం పిలుపు మేరకు జనాభా నియంత్రణను సమర్థవంతంగా అమలు చేశాయని, ఇప్పుడు అదే జనాభా ప్రాతిపదికన సీట్లు తగ్గిస్తే అది మా అభివృద్ధికి ఇచ్చే శిక్షా? అని రేవంత్ ప్రశ్నించారు. ఉత్తర భారతాన్ని గెలిస్తే చాలు అన్న చందంగా మోదీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని, దీనివల్ల దక్షిణాది రాష్ట్రాల నేతలకు జాతీయ రాజకీయాల్లో చోటు లేకుండా పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. మోదీ హయాంలో టాప్ 10 అత్యున్నత పదవుల్లో దక్షిణాది రాష్ట్రాలకు చెందిన వారికి చోటు దక్కలేదని ఆయన గుర్తు చేశారు.

దక్షిణాది ఐక్యత.. ఎన్నికల ప్రచారాస్త్రం

నియోజకవర్గాల పెంపుపై అటెండర్ నుంచి రాష్ట్రపతి వరకు చర్చ జరగాలని, ఏకపక్ష నిర్ణయాలు చెల్లవని రేవంత్ స్పష్టం చేశారు. డి-లిమిటేషన్ వల్ల కలిగే నష్టాలపై దక్షిణాది రాష్ట్రాలన్నీ ఏకం కావాలని పిలుపునిచ్చారు. రాబోయే ఎన్నికల ప్రచారంలో ఈ అంశాన్ని ప్రధాన అస్త్రంగా మార్చుకుంటామని, దక్షిణాది పట్ల కేంద్రం చూపుతున్న వివక్షను ప్రజలకు వివరిస్తామని ప్రకటించారు.

Loading...
Unable to load recommendations.
Follow Us