కోటి ఎకరాల మాగాణం దిశగా తెలంగాణ.. సాగునీటి ప్రాజెక్టుల పూర్తితో మారిన దశ.. రికార్డు స్థాయిలో వరిసాగు

|

Mar 18, 2021 | 9:16 AM

నా తెలంగాణ.. కోటి రతణాల వీణ. దాశరథి కలం నుంచి జాలువారిన ఈ పద కవితా ఝడి తెలంగాణ తొలి, మలి ఉద్యమంలో వలస పాలకుల విముక్తికి నినదించింది. నీళ్లు, నిధులు, నియామకాల..

కోటి ఎకరాల మాగాణం దిశగా తెలంగాణ.. సాగునీటి ప్రాజెక్టుల పూర్తితో మారిన దశ.. రికార్డు స్థాయిలో వరిసాగు
Ts Crops
Follow us on

నా తెలంగాణ.. కోటి రతణాల వీణ. దాశరథి కలం నుంచి జాలువారిన ఈ పద కవితా ఝడి తెలంగాణ తొలి, మలి ఉద్యమంలో వలస పాలకుల విముక్తికి నినదించింది. నీళ్లు, నిధులు, నియామకాల పునాదిగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం కోటి ఎకరాల మాగాణం దిశగా దూసుకెళుతుంది. ఆరేళ్ల కిందటి వరకు పల్లేర్లు మొలిచిన బీడు భూములు ప్రస్తతం పచ్చని పంట పొలాలుగా మారాయి. అంతే కాదు దేశంలోనే అత్యధిక పంటలు సాగు చేసే రాష్ట్రంగా ప్రతీ ఏటా తెలంగాణ తన రికార్డును తానే తిరిగరాసుకుంటుంది.

ప్రస్తుత యాసంగి సీజన్లో రాష్ట్రంలో పంటల సాగు రికార్డు స్థాయిలో పెరిగింది. అన్ని పంటలు కలిసి సాధారణంకన్నా 85 శాతం అధికంగా సాగైతే.. వరి సాగు 135 శాతం పెరిగింది. రాష్ట్రంలో అన్ని పంటల సాధారణ సాగు విస్తీర్ణం 36.43 లక్షల ఎకరాలకు గాను 67.47 లక్షల ఎకరాలలో విత్తనాలు , నాట్లు వేసినట్లు వ్యవసాయ శాఖ తాజా నివేదికలో వెల్లడించింది.

గతేడాది ఇదే సమయానికి సాగైన 52.22 లక్షల ఎకరాలతో పోల్చితే.. ఈ సీజన్‌లో అదనంగా 15 లక్షల ఎకరాలు పెరిగింది. ఈస్థాయిలో యాసంగి పంటలు వేయడం తెలంగాణ చరిత్రలోనే ఇదే తొలిసారి అని వ్యవసాయశాఖ ముఖ్యకార్యదర్శి బి.జనార్దన్‌రెడ్డి చెప్పారు. వరి సాధారణ సాగు విస్తీర్ణం 22.19 లక్షల ఎకరాలకు.. 52.28 లక్షల ఎకరాల్లో నాట్లు వేయడం విశేషం. గతేడాది ఈ సమయానికి 38.62 లక్షల ఎకరాల్లోనే నాట్లు వేశారు. వేరుసెనగ మినహా.. మిగిలిన అన్ని పంటలు సాధారణంకన్నా ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేశారు. సాధారణ సాగుతో పోల్చితే పప్పుధాన్యాలు 49, ఆహారధాన్యాలు 107 శాతం అధిక విస్తీర్ణంలో పంటలు వేశారు.

గతంలో 2014–15 వానాకాలం, యాసంగి కలిపి పంటల సాగు విస్తీర్ణం 1.40 కోట్ల ఎకరాలు. ఈ ఏడేళ్లలో సాగు విస్తీర్ణం ఏకంగా 69 లక్షల ఎకరాలు పెరిగింది. 2020–21 ఖరీఫ్‌లో 1.20 కోట్ల మెట్రిక్‌ టన్నుల వరి ఉత్పత్తి కాగా, రబీలో దాదాపు 1.35 కోట్ల మెట్రిక్‌ టన్నులకు పైగా వస్తుందని అంచనా. ఈ యాసంగిలో 65.02 లక్షల ఎకరాల విస్తీర్ణంలో పంటలు సాగయ్యాయి. ఇది తెలంగాణలో ఆల్‌టైం రికార్డుగా వ్యవసాయశాఖ పేర్కొంది. యాసంగి వరిసాగు కూడా ఆల్‌టైం రికార్డు నమోదైనట్లు వెల్లడించింది. 50.49 లక్షల ఎకరాల్లో వరినాట్లు పడినట్లు తెలిపింది.

యాసంగిలో సాధారణ వరి సాగు విస్తీర్ణం 22.19 లక్షల ఎకరాలు కాగా, గతేడాది యాసంగిలో 26.97 లక్షల ఎకరాల్లో సాగైంది. అదే ఇప్పటివరకు యాసంగి రికార్డు సాగు. కానీ ఈయేడు యాసంగిలో భారీగా వరి సాగై కొత్త రికార్డును నెలకొల్పింది. వరి సాగు విస్తీర్ణంలో దేశంలోనే తెలంగాణ నంబర్‌గా నిలిచినట్లు వ్యవసాయ శాఖ తెలిపింది. ప్రస్తుతం ఉద్యాన పంటల సాగు విస్తీర్ణం 12.50 లక్షల ఎకరాలు ఉండగా, దాన్ని దీర్ఘకాలికంగా 66లక్షల ఎకరాలకు విస్తరించాలని ఉద్యాన శాఖ నిర్ణయించింది. అంటే 5 రెట్లకుపైనే ఉద్యాన పంటలను విస్తరించాలని భావిస్తోంది.

దేశవ్యాప్తంగా ఆయిల్‌పాం సాగు పెంచాలని కేంద్రం నిర్ణయించింది. అందులో భాగంగా తెలంగాణలోనూ ఆయిల్‌పాం సాగుపై ఉద్యాన శాఖ దృష్టి సారించింది. రాష్ట్రంలో ప్రస్తుతం ఆయిల్‌ఫాం సాగు విస్తీర్ణం కేవలం 38 వేల ఎకరాలు మాత్రమే. దీంట్లో 2.08లక్షల మెట్రిక్‌ టన్నులే ఉత్పత్తి వస్తోంది. ఈ పరిస్థితి నుంచి బయటపడాలని.. 2026 నాటికి స్వయం సమృద్ధి సాధించాలని, 2027 నుంచి ఎగుమతులు చేసే స్థాయికి చేరుకోవా లని ఉద్యానశాఖ లక్ష్యంగా పెట్టుకుంది. అందులో భాగంగా ఇప్పటికే రాష్ట్రంలో స్వల్పకాలిక విస్తరణలో భాగంగా 8.52 లక్షల ఎకరాల్లో ఆయిల్‌పాం సాగు చేపట్టాలని నిర్ణయించింది. అందుకోసం ఆయిల్‌ఫెడ్‌ సహా వివిధ కంపెనీలకు సాగు ప్రాంతాలను అప్పగించింది. దీర్ఘకాలిక విస్తరణ కింద 15 లక్షల ఎకరాల్లో సాగు, 1.65 కోట్ల మెట్రిక్‌ టన్నుల ఉత్పత్తిని లక్ష్యంగా నిర్దేశించుకుంది.

Read More:

బండి సంజయ్‌ వ్యాఖ్యలపై తెలంగాణ ఐపీఎస్‌ అసోసియేషన్‌ గుస్సా.. ఆ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని ప్రకటన