Telangana: చితి మంటల వేళ ఆస్తి మంటలు.. తండ్రి అంత్యక్రియలను అడ్డుకున్న కూతుళ్లు.. ఏం జరిగిందంటే..?

కన్నతండ్రి శవం కళ్లముందే ఉంది.. కనీసం కన్నీళ్లు కూడా రాలేదు.. కానీ ఆస్తి పోతుందేమో అన్న స్వార్థం వారిలో నిద్రలేచింది.. జగిత్యాలలో జరిగిన ఓ ఘటన వింటే సమాజంలో మానవ సంబంధాలు ఎంతలా దిగజారిపోయాయో అర్థమవుతుంది. పక్షవాతంతో చనిపోయిన ఓ వృద్ధుడికి తలకొరివి పెట్టే విషయంలో కూతుళ్లు, అల్లుళ్లు సృష్టించిన రచ్చ అంతా ఇంతా కాదు.

Telangana: చితి మంటల వేళ ఆస్తి మంటలు.. తండ్రి అంత్యక్రియలను అడ్డుకున్న కూతుళ్లు.. ఏం జరిగిందంటే..?
Property Dispute Halts Elderly Man Funeral

Edited By:

Updated on: Jun 09, 2026 | 2:00 PM

మరణం వేళ మనుషులు ఒక్కటవుతారు.. పాత పగలు, కోపాలు మరచిపోయి కడసారి వీడ్కోలు పలుకుతారు.. ఇదంతా ఒకప్పటి మాట. ప్రస్తుత సమాజంలో బంధాలు, అనుబంధాల కంటే ఆస్తికే ప్రాధాన్యత పెరిగిపోయిందని నిరూపించే అత్యంత హృదయ విదారక ఘటన జగిత్యాల పట్టణంలో చోటుచేసుకుంది. జీవితాంతం కుటుంబం కోసం కష్టపడ్డ ఓ వృద్ధుడి మృతదేహం చితిపైకి చేరినా, అంతిమ వీడ్కోలు ఇవ్వాల్సిన కన్నబిడ్డలు, అల్లుళ్లు ఆస్తి కోసం దాడులకు తెగబడ్డారు. మానవత్వాన్ని నగ్నంగా ప్రశ్నించే ఈ ఘటన స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. జగిత్యాల పట్టణంలోని హనుమాన్‌వాడకు చెందిన జంగిలి మల్లయ్య అనే వృద్ధుడు కొంతకాలంగా పక్షవాతంతో బాధపడుతూ ఇటీవల మృతి చెందాడు. అయితే కన్నతండ్రి చనిపోయాడనే కన్నీళ్ల కంటే ఆయన వెనకేసి పోయిన ఆస్తులు ఎవరికి దక్కాలనే ఆస్తి వివాదం శవం ముందే తెరపైకి వచ్చింది.

కరోనా సమయంలోనే మల్లయ్య ఏకైక కుమారుడు మరణించాడు. దీంతో ఆయన మనుమడు మనోహర్ కుటుంబ వారసుడిగా ఉన్నాడు. అయితే మల్లయ్యకు చెందిన ఆస్తులను ఆయన కూతుళ్లు ఇప్పటికే తమ పేర్లపైకి మార్చుకున్నట్లు గట్టి ఆరోపణలు ఉన్నాయి. హిందూ సంప్రదాయాల ప్రకారం.. చనిపోయిన మల్లయ్యకు ఆయన మనుమడు మనోహర్ చితికి తలకొరివి పెట్టాలని కుల పెద్దలు, బంధువులు సూచించారు. కానీ మనవడు తలకొరివి పెడితే రేపు ఆస్తిలో ఎక్కడ వాటా అడుగుతాడో అన్న స్వార్థంతో మల్లయ్య కూతుళ్లు, అల్లుళ్లు అంత్యక్రియలను అడ్డుకున్నారు. వారసుడిగా మనవడు తలకొరివి పెట్టడానికి వీల్లేదంటూ శ్మశానవాటికలోనే ఉద్రిక్త వాతావరణం సృష్టించారు.

చితి ముందే దాడులు.. గాయాలు..

ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య మాట మాట పెరిగి, వ్యవహారం కాస్తా చేతి దాకా వెళ్లింది. మృతుడి కూతుళ్లు, అల్లుళ్లు అమానుషంగా ప్రవర్తిస్తూ.. మల్లయ్య కోడలు, మనుమడు మనోహర్, మనవరాలిపై దాడులకు తెగబడ్డారు. ఈ ఘోరమైన దాడిలో కొందరికి గాయాలయ్యాయి. ఒకవైపు కన్నతండ్రి మృతదేహం చివరి యాత్ర కోసం ఎదురుచూస్తుండగా.. అవేమీ పట్టించుకోకుండా ఆస్తి హక్కుల కోసం కుటుంబ సభ్యులు పరస్పరం దాడులు చేసుకోవడంతో అంత్యక్రియలు కాసేపు నిలిచిపోయాయి.

పోలీసులకు ఫిర్యాదు.. విలువల సంక్షోభం

చితి మంటల కంటే ఆస్తి వివాదాల మంటలే ఎక్కువగా రగిలిన ఈ ఘటనపై మృతుడి మనుమడు మనోహర్, అతని తల్లి పోలీసులను ఆశ్రయించారు. అల్లుళ్ల దాడిపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ప్రేమాభిమానాలు నిలవాల్సిన చోట.. కన్నతండ్రి చివరి ప్రయాణాన్ని కూడా ప్రశాంతంగా సాగనీయకుండా చేసిన ఈ ఘటనపై స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మనుషుల్లో చచ్చిపోతున్న మానవత్వానికి ఈ జగిత్యాల ఘటనే నిదర్శనమని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Follow Us