నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం (Nizamabad Rural Assembly Election)లో కాంగ్రెస్ అభ్యర్థి ఆర్ భూపతిరెడ్డి, సమీప బీఆర్ఎస్ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్పై విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి దినేష్ కులాచారి మూడోవ స్థానానికే పరిమితమయ్యారు.
నిజామాబాద్ జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో రూరల్ నియోజవకర్గం కీలకమైనది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత నిజామాబాద్ రూరల్ లో బీఆర్ఎస్ పార్టీదే హవా కొనసాగుతూ వస్తోంది. 2014, 2018 ఎన్నికల్లో నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం నుంచి బాజిరెడ్డి గోవర్దన్ గెలుపొందారు. ఇప్పటి వరకు మొత్తం నాలుగుసార్లు ఎమ్మెల్యేగా సేవలందించిన ఆయన.. ఐదోసారి ఎమ్మెల్యేగా గెలవాలని భావించారు. అయితే అనుహ్యంగా కాంగ్రెస్ అభ్యర్థి భూపతిరెడ్డికి పట్టం కట్టారు ఓటర్లు. సమీప బీఆర్ఎస్ అభ్యర్థి గోవర్ధన్పై 21,963 ఓట్ల మెజారిటీతోె గెలుపొందారు. భూపతిరెడ్డికి 78,378 ఓట్లు పోలవ్వగా, బాజిరెడ్డి గోవర్ధన్కు 56,415 ఓట్లు వచ్చాయి. ఇక బీజేపీ అభ్యర్థి దినేష్ కులాచారికి 49,723 దక్కాయి.
ఈ నియోజకవర్గంలో మొత్తం ఓట్ల సంఖ్య 2,53,233 మంది ఓటర్లు ఉన్నారు. 2023 ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో 76.43 శాతం పోలింగ్ నమోదయ్యింది. 2014 ఎన్నికల ముందు అనూహ్యమైన రీతిలో బాజిరెడ్డి టీఆర్ఎస్లో చేరి కాంగ్రెస్ సీనియర్ నేత డి.శ్రీనివాస్ను ఓడించారు. 2018లో మరోసారి ఇక్కడే ఆయన కాంగ్రెస్ ప్రత్యర్థి భూపతి రెడ్డిపై 25,655 ఓట్ల మెజార్టీతో గెలిచారు. భూపతి రెడ్డి టిఆర్ఎస్ ఎమ్మెల్సీగా ఉంటూ టిక్కెట్ ఇవ్వలేదన్న అసంతృప్తితో కాంగ్రెస్ లో చేరి ఓటమి పాలయ్యారు.
2018లో బాజిరెడ్డి గోవర్ధన్కు 87,756 ఓట్లు రాగా భూపతి రెడ్డికి 57,911 ఓట్లు వచ్చాయి. కాగా బీజేపీ నుంచి పోటీచేసిన కేశుపల్లి ఆనందరెడ్డికి 16వేల పైచిలుకు ఓట్లు మాత్రమే లభించాయి. బాజిరెడ్డి గోవర్ధన్ మున్నూరు కాపు సామాజికవర్గానికి చెందినవారు. గతంలో డిచ్పల్లి నియోజకవర్గంగా ఉన్న ఈ ప్రాంతంలో కమ్మ సామాజికవర్గం నేతలు అత్యధికసార్లు గెలిచారు.. టీడీపీకి గట్టి పట్టు ఉంది. ఈ నియోజకవర్గం పునర్విభజన జరిగిన తర్వాత నిజామాబాద్ రూరల్గా మారింది.
అంతకుముందు డిచ్పల్లి పేరుతో ఉండేది. రద్దయిన డిచ్పల్లి, ఇప్పటి నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో ఏడుసార్లు కమ్మ సామాజికవర్గం నేతలు గెలుపొందితే, రెండు సార్లు రెడ్లు, మూడు సార్లు బిసి (మున్నూరుకాపు) నేతలు గెలుపొందారు. ఇక్కడి నుంచి సీనియర్ నేత మండవ వెంకటేశ్వరరావు ఐదుసార్లు విజయం సాధించారు. మండవ వెంకటేశ్వరరావు 2023 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో చేరారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల లైవ్ కవరేజ్