TG Rain Alert: 3 గంటల్లో దంచికొట్టిన వాన.. 74.8 మి.మీ వ‌ర్షపాతం నమోదు! మరో 2 రోజులు భారీ వర్షాలు

|

Aug 16, 2024 | 12:20 PM

తెలంగాణ రాష్ట్ర రాజ‌ధాని హైద‌రాబాద్‌లో గురువారం (ఆగస్టు 15) రాత్రి వాన దంచికొట్టింది. ఏక ధాటిగా మూడు గంట‌ల పాటు వర్షం కురిసింది. భారీ వ‌ర్షానికి భాగ్యన‌గ‌రం అత‌లాకుత‌ల‌మైంది. వానకు తోడుగా బ‌ల‌మైన ఈదురుగాలులు కూడా వీచాయి. ఒక్కసారిగా వర్షం విరుచుకు పడటంతో ప‌లు చోట్ల రోడ్లన్నీ నీటితో మునిగిపోయాయి. మోకాళ్ల లోతు వ‌ర్షం నీరు నిలిచిపోవ‌డంతో వాహ‌నాలు నానా అవస్థలు పడ్డారు..

TG Rain Alert: 3 గంటల్లో దంచికొట్టిన వాన.. 74.8 మి.మీ వ‌ర్షపాతం నమోదు! మరో 2 రోజులు భారీ వర్షాలు
Telangana Rains
Follow us on

హైద‌రాబాద్, ఆగస్టు 16: తెలంగాణ రాష్ట్ర రాజ‌ధాని హైద‌రాబాద్‌లో గురువారం (ఆగస్టు 15) రాత్రి వాన దంచికొట్టింది. ఏక ధాటిగా మూడు గంట‌ల పాటు వర్షం కురిసింది. భారీ వ‌ర్షానికి భాగ్యన‌గ‌రం అత‌లాకుత‌ల‌మైంది. వానకు తోడుగా బ‌ల‌మైన ఈదురుగాలులు కూడా వీచాయి. ఒక్కసారిగా వర్షం విరుచుకు పడటంతో ప‌లు చోట్ల రోడ్లన్నీ నీటితో మునిగిపోయాయి. మోకాళ్ల లోతు వ‌ర్షం నీరు నిలిచిపోవ‌డంతో వాహ‌నాలు నానా అవస్థలు పడ్డారు. దీంతో ప‌లు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ప్రయాణికులు ఎక్కడికక్కడ రోడ్లపై చిక్కుకుపోయారు.

బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం ప్రభావంతో హైదరాబాద్‌ నగరంలో పలు చోట్ల భారీ వర్షం కురిసింది. గడచిన మూడు, నాలుగు రోజులుగా ఉక్కపోతతో నగరవాసులు ఉక్కిరి బిక్కిరవుతున్న క్రమంలో వర్షం కాస్త ఉపశమనం కలిగినట్లైంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. గురువారం రాత్రి 9 గంటల వరకు సికింద్రాబాద్‌లోని పాటిగడ్డలో అత్యధికంగా 74.8 మి.మీ, బన్సీలాల్‌పేట్‌లో 73.0 మి.మీ. వర్షపాతం నమోదైనట్లు తెలంగాణ డెవ‌ల‌ప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ (టీజీడీపీఎస్‌) అధికారులు వెల్లడించారు. ముషీరాబాద్‌లో 73 మి.మీ., రామ‌చంద్రాపురంలో 68.5 మి.మీ., కూక‌ట్‌ప‌ల్లిలో 64.8 మి.మీ. వ‌ర్షపాతం న‌మోదైన‌ట్లు వెల్లడించారు. ఇక జిల్లాల విషయానికొస్తే సంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా 93.5 మిల్లీమీటర్ల, నాగ‌ర్‌క‌ర్నూల్ జిల్లాలో 87 మిల్లీమీటర్ల వ‌ర్షపాతం న‌మోదైంది.

ఆవర్తనం కొనసాగుతుండటం వల్ల రాగల మరో రెండు రోజులు హైదరాబాద్‌లో పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. మరికొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు నుంచి భారీవర్షాలు కురిసే అవకాశాలున్నట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆగస్టు 17వ తేదీ వ‌ర‌కు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ప‌లు జిల్లాల‌కు ఎల్లో అల‌ర్ట్ జారీ చేసింది. గ్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ ప‌రిధిలో అధికారులు హెల్ప్ లైన్ ఏర్పాటు చేశారు. ఏవైనా ఇబ్బందులు తలెత్తితే 040-21111111 లేదా 9000113667 నంబ‌ర్లను ఫోన్‌ ద్వారా సంప్రదించాల‌ని కోరారు.

ఇవి కూడా చదవండి

 

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.