Harish Rao: ‘కాంగ్రెస్‌ తీరు.. వంట అయ్యాక గరిట తిప్పినట్లు ఉంది’.. హరీష్‌ సెటైర్లు..

| Edited By: Narender Vaitla

Jan 30, 2024 | 3:19 PM

తెలంగాణ వైద్యారోగ్య రంగాన్ని దేశంలోనే నెంబర్ 1 స్థానానికి చేర్చే లక్ష్యంలో భాగంగా పెద్ద సంఖ్యలో ఆసుపత్రుల నిర్మాణంతో పాటు, జిల్లాకు ఒక మెడికల్ కాలేజీని బీఆర్ఎస్ ప్రభుత్వం మంజూరు చేసిందని,ఈ క్రమంలో వైద్య సిబ్బంది కొరత లేకుండా ఉండేందుకు మెడికల్, నర్సింగ్, పారామెడికల్, ఫార్మాసిస్టు, ఇతర సిబ్బంది...

Harish Rao: కాంగ్రెస్‌ తీరు.. వంట అయ్యాక గరిట తిప్పినట్లు ఉంది.. హరీష్‌ సెటైర్లు..
Harish Rao
Follow us on

స్టాఫ్ నర్సులకు నియామక పత్రాలు అందించే కాంగ్రెస్ ప్రభుత్వ కార్యక్రమం ‘వంట అయినంక గరిటె తిప్పినట్లు’ ఉందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. ఉద్యోగ భర్తీ ప్రక్రియను బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పూర్తి చేస్తే, తమ ప్రభుత్వ ఘనతగా నియామక పత్రాల జారీ పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం హడావుడి చేస్తుండటం దౌర్భాగ్యమన్నారు. ఫిబ్రవరి 1, 2024 న గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇస్తామని పత్రికల సాక్షిగా ప్రచారం చేసిన కాంగ్రెస్ పార్టీ, దాని నుంచి విద్యార్థుల దృష్టి మరల్చేందుకే ముందు రోజున స్టాఫ్ నర్సులకు నియామకపత్రాల జారీ కార్యక్రమాన్ని హంగు ఆర్బాటంతో నిర్వహిస్తుందన్నారు. చేయని పనులకు డబ్బా కొట్టుకోవడం బదులు, ఎన్నికల వేళ ఇచ్చిన హామీల అమలుపై శ్రద్ధ చూపాలని కాంగ్రెస్ నేతలకు హితవు పలికారు హరీష్ రావు.

తెలంగాణ వైద్యారోగ్య రంగాన్ని దేశంలోనే నెంబర్ 1 స్థానానికి చేర్చే లక్ష్యంలో భాగంగా పెద్ద సంఖ్యలో ఆసుపత్రుల నిర్మాణంతో పాటు, జిల్లాకు ఒక మెడికల్ కాలేజీని బీఆర్ఎస్ ప్రభుత్వం మంజూరు చేసిందని,ఈ క్రమంలో వైద్య సిబ్బంది కొరత లేకుండా ఉండేందుకు మెడికల్, నర్సింగ్, పారామెడికల్, ఫార్మాసిస్టు, ఇతర సిబ్బంది రిక్రూట్మెంట్ కు శ్రీకారం చుట్టిందన్నారు. ఇందులో భాగంగా 5,204 స్టాఫ్ నర్స్ పోస్టులకు 2022 డిసెంబర్ 30న నోటిఫికేషన్ విడుదల చేయగా, 2023 జూన్ 22న 1,890 పోస్టులను కలుపుతూ ఉత్తర్వులు జారీ చేసిందని, దీంతో మొత్తం పోస్టుల సంఖ్య 7,094కు పెరిగిందని తెలిపారు.

2023 ఆగస్టు 2న ఉద్యోగాలకు పరీక్ష నిర్వహించి, తుది ఫలితాలు విడుదల చేసే సమయానికి ఎన్నికల కోడ్ మొదలైందని, దీంతో తుది ఫలితాల విడుదలకు తాత్కాలిక ఆటంకం కలిగిందని గుర్తు చేశారు హరీష్ రావు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర స్థాయి కార్యక్రమం నిర్వహిస్తూ, నియామక పత్రాలు ఇచ్చే పేరిట హడావుడి చేస్తూ, స్టాఫ్ నర్సు నోటిఫికేషన్ తమ ప్రభుత్వ ఘనతగా ప్రచారం చేసుకుంటున్నదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం, ఏడాదిలోగా 2 లక్షల పోస్టులను భర్తీ చేయాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు.

మొదటి క్యాబినెట్ సమావేశంలోనే ఆమోదించి, అభ్యర్థులకు ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేకుండా, ఏడాదిలోపే అన్ని ఉద్యోగాలను భర్తీ చేస్తామని, అలాగే గతంలో ప్రారంభించిన నియామకాల ప్రక్రియను వాటి షెడ్యూల్ ప్రకారం పూర్తి చేస్తామని కాంగ్రెస్ జాబ్ క్యాలెండర్ పేరిట పత్రికల్లో ప్రకటనలు విడుదల చేసిందని గుర్తు చేశారు. చెప్పినట్లుగా ఫిబ్రవరి 1వ తేదీన గ్రూప్ 1 నోటిఫికేషన్, అలాగే ఏప్రిల్ 1న గ్రూప్ 2, జూన్ 1న గ్రూప్ 3,4 నియామకాలకు నోటిఫికేషన్, మార్చి1న పోలీసు సహా తరహా యూనిఫాం పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ హామీలను నమ్మి ఎదురుచూస్తున్న ఉద్యోగ అభ్యర్థులకు, విద్యార్థులకు న్యాయం చేయాలన్నారు హరీష్‌ రావు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..