రాష్ట్రాల మధ్య సమన్వయం కోసమే కేంద్రం ప్రయత్నం.. కేంద్ర జల్‌శక్తి మంత్రి సలహాదారు వెదిరె శ్రీరాం

KRMB ఒక్క ప్రాజెక్టును కూడా టేకోవర్‌ చేయలేదని కేంద్ర జల్‌శక్తి మంత్రి సలహాదారు వెదిరె శ్రీరాం స్పష్టం చేశారు. KRMBని విలన్‌గా చూపించే ప్రయత్నం మంచిది కాదన్నారాయన. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పరస్పరం విమర్శలతో కాలం గడుపుతున్నాయని, KRMB లేకుంటే ఏపీ, తెలంగాణ మధ్య సమన్వయం ఎలా అని ప్రశ్నించారు శ్రీరాం. కృష్ణా నదిపై ప్రాజెక్టులు, నదీ యాజమాన్య బోర్డు KRMB విధివిధానాలపై హైదరాబాద్‌లో నిర్వహించిన సమావేశంలో కేంద్ర జల్‌శక్తి మంత్రి సలహాదారు వెదిరె శ్రీరాం వివరణ ఇచ్చారు.

రాష్ట్రాల మధ్య సమన్వయం కోసమే కేంద్రం ప్రయత్నం.. కేంద్ర జల్‌శక్తి మంత్రి సలహాదారు వెదిరె శ్రీరాం
KRMB

Updated on: Mar 01, 2024 | 6:58 AM

KRMB ఒక్క ప్రాజెక్టును కూడా టేకోవర్‌ చేయలేదని కేంద్ర జల్‌శక్తి మంత్రి సలహాదారు వెదిరె శ్రీరాం స్పష్టం చేశారు. KRMBని విలన్‌గా చూపించే ప్రయత్నం మంచిది కాదన్నారాయన. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పరస్పరం విమర్శలతో కాలం గడుపుతున్నాయని, KRMB లేకుంటే ఏపీ, తెలంగాణ మధ్య సమన్వయం ఎలా అని ప్రశ్నించారు శ్రీరాం. కృష్ణా నదిపై ప్రాజెక్టులు, నదీ యాజమాన్య బోర్డు KRMB విధివిధానాలపై హైదరాబాద్‌లో నిర్వహించిన సమావేశంలో కేంద్ర జల్‌శక్తి మంత్రి సలహాదారు వెదిరె శ్రీరాం వివరణ ఇచ్చారు. మేడిగడ్డ ఘటన తర్వాత కేంద్ర ప్రభుత్వం అడిగిన వివరాలను ఇప్పటి ప్రభుత్వం కూడా వివరాలు ఇవ్వలేదని వివరించారు. ఇప్పటికైనా జాతీయ డ్యాం భద్రతా సంస్థ NDSA బృందానికి సమాచారం ఇచ్చి సహకరించాలని శ్రీరాం సూచించారు. రాష్ట్రం సమాచారం ఇస్తేనే NDSA విచారణ చేయగలుగుతుందని తెలిపారు. మేడిగడ్డ కట్టేటప్పుడు జియోలాజికల్‌ సర్వే వారి సహాయం తీసుకుని ఉండాల్సిందని, సర్వే చేయకుండా ప్రాజెక్టు కట్టడం అతి పెద్ద తప్పన్నారు శ్రీరాం. థర్డ్‌ పార్టీ నాణ్యత తనిఖీలు చేయడం చాలా అవసరమని చెప్పారాయన. ప్రాజెక్టు నిర్మాణం వివిధ స్థాయిల్లో కంప్లిషన్‌ రిపోర్టులు ఇవ్వాలని, అయితే మొత్తం ప్రాజెక్టుకు ఒకేసారి కంప్లిషన్‌ రిపోర్టు ఇచ్చారన్నారు శ్రీరాం. రాష్ట్రం నుంచి స్పష్టమైన సమాచారం రావట్లేదని, సరైన సమాచారం ఇవ్వకపోతే.. కేంద్రం కూడా సాయం చేయలేదన్నారు శ్రీరాం.

NDSA కమిటీ ఏర్పాటుకు కేంద్ర మంత్రి ఆమోదం తెలిపారని, వచ్చేవారం NDSA కమిటీ రాష్ట్రానికి వస్తుందని శ్రీరాం చెప్పారు. అడిగిన సమాచారం కమిటీకి ఇస్తే విచారణ సత్వరం పూర్తవుతుందని తెలిపారు. ఆరు ప్రాజెక్టులను పూర్తి చేసుకోవాలని విభజన చట్టంలో చెప్పారని, నీటి కేటాయింపులు మాత్రం చెప్పలేదన్నారు శ్రీరాం. నాలుగు ఏపీ, రెండు తెలంగాణ ప్రాజెక్టులకు కేటాయింపులు లేవన్నారు. తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల సమస్య పరిష్కారం కోసమే గత అక్టోబర్‌లో కొత్త ట్రైబ్యునల్‌ వేశారని శ్రీరాం గుర్తు చేశారు. విభజన చట్టం రూపొందించిందే అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వమని, ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించాలని విభజన చట్టం చెబుతోందని, ఇప్పుడు తెలంగాణలోని కాంగ్రెస్‌ ప్రభుత్వమే దాన్ని తప్పు అంటోందన్నారు శ్రీరాం.

పదేళ్లుగా శ్రీశైలాన్ని ఏపీ, సాగర్‌ను తెలంగాణ నిర్వహిస్తున్నాయని, 299 టీఎంసీలకు గతంలోనే తెలంగాణ అంగీకరించిందన్నారు శ్రీరాం. కేఆర్‌ఎంబీకి కొత్తగా ఎవరూ ప్రాజెక్టులు ఇచ్చింది లేదని, ఏపీ, తెలంగాణ పరస్పరం మాట్లాడుకొని పరిష్కరించుకుంటే గొడవే ఉండదన్నారు శ్రీరాం. రాష్ట్రాల మధ్య సమన్వయం కోసమే కేంద్రం ప్రయత్నిస్తోందని తెలిపారు. అంతేకాకుండా.. ప్రజల్లో అపోహలు సృష్టించే ప్రయత్నాలను పార్టీలు చేయకూడదని సలహా ఇచ్చారు శ్రీరాం.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..