Nalgonda: బీఆర్ఎస్ ఆఫీస్ను కూల్చేయండి.. కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
నల్లగొండ పట్టణం నడిబొడ్డున.. అనుమతి లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా బీఆర్ఎస్ పార్టీ నిర్మించారని మంత్రి ఆరోపించారు. రూ. 100 కోట్లు విలువైన ప్రభుత్వ స్థలంలో.. పార్టీ కార్యాలయం ఎలా నిర్మిస్తారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ను తక్షణమే కూల్చేయాలనీ.. మున్సిపల్ కమిషనర్ ను మంత్రి ఆదేశించారు. పేదవాడు సొంత స్థలంలో...
![Nalgonda: బీఆర్ఎస్ ఆఫీస్ను కూల్చేయండి.. కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/07/komati-reddy-venkat-reddy.jpg?w=1280)
మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నల్లగొండ పట్టణంలో నిర్మించిన బీఆర్ఎస్ జిల్లా కార్యాలయాన్ని కూల్చివేయాంటూ ఆదేశాలు జారీ చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని నిర్మించారని మంత్రి ఆరోపించారు. సోమవారం నల్లగొండ పట్టణంలో 13 కోట్ల రూపాయలతో 33 కెవి విద్యుత్ సబ్ స్టేషన్కు శంకుస్థాపన చేసిన తర్వాత మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు.
నల్లగొండ పట్టణం నడిబొడ్డున.. అనుమతి లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా బీఆర్ఎస్ పార్టీ నిర్మించారని మంత్రి ఆరోపించారు. రూ. 100 కోట్లు విలువైన ప్రభుత్వ స్థలంలో.. పార్టీ కార్యాలయం ఎలా నిర్మిస్తారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ను తక్షణమే కూల్చేయాలనీ.. మున్సిపల్ కమిషనర్ ను మంత్రి ఆదేశించారు. పేదవాడు సొంత స్థలంలో ఇల్లు కట్టుకుంటే సవాలక్ష రూల్స్ పెడుతున్న అధికారులు.. రూ. 100 కోట్ల విలువైన భూమిలో అనుమతి లేకుండా ఇంద్ర భవనం లాంటి పార్టీ ఆఫీస్ కడుతుంటే ఏం చేస్తున్నారని కోమటిరెడ్డి ప్రశ్నించారు.
ఇప్పటివరకు అక్రమ నిర్మాణానికి సంబంధించి నోటీసులు ఏమైనా ఇచ్చారా.? అని మున్సిపల్ కమిషనర్ను కోమటిరెడ్డి ప్రశ్నించారు. ఇప్పటివరకు రెండుసార్లు అందజేశామని కమిషనర్ సమాధానం చెప్పారు. పదిసార్లు అయినా నోటీసులిచ్చి అక్రమ నిర్మాణాన్ని కూల్చివేయాలని ఆయన ఆదేశించారు. ప్రభుత్వ స్థలంలో అక్రమంగా అనుమతుల్లేకుండా నిర్మించిన బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ వ్యవహారాన్ని మానిటర్ చేయాలని జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డికు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సూచించారు.
ఇదిలా ఉంటే రైతుల రుణ మాఫీపై కూడా మంత్రి కీలక ప్రకనట చేశారు. ఆగస్టు 15వ తేదీలోపు 32 వేల కోట్ల రుణాలను మాఫీ చేస్తామని అన్నారు. రైతులకు 2 లక్షల రుణమాఫీని ఏకకాలంలో చేస్తున్నామని మంత్రి తెలిపారు. లక్షల కోట్ల అప్పులు ఉన్నా సీఎం రేవంత్ రెడ్డి రైతుల రుణ మాఫీ చేసే దిశగా అడుగులు వేస్తున్నారని, పైసాపైసా పోగు చేసి రైతులకు సహాయం చేస్తున్నామన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..