
మావోయిస్టు దళాల్లో కీలక వ్యూహకర్తగా ఓ దశాబ్దం పాటు అండర్గ్రౌండ్లో పనిచేసిన హిడ్మా మరణంపై కేంద్ర కమిటీ స్పందించింది. అభయ్ పేరిట విడుదల చేసిన లేఖలో మావోయిస్టుల కేంద్ర కమిటీ పోలీసులు జరిపిన ఎన్కౌంటర్లపై తీవ్ర ఆరోపణలు చేసింది. ఆయుధాలు లేని సమయంలో, వైద్యం కోసం విజయవాడకు వచ్చిన హిడ్మాను ఒక ద్రోహి ఇచ్చిన సమాచారంతో పోలీసులు పట్టుకొని క్రూరంగా హత్య చేశారని కేంద్ర కమిటీ ఆరోపించింది. ఈ హత్యను ‘మారేడుమిల్లి ఎన్కౌంటర్’గా కట్టుకథగా ప్రచారం చేశారని లేఖలో పేర్కొంది. ఇదే విధంగా శంకర్ను కూడా చంపి ‘రంపచోడవరం ఎన్కౌంటర్’ పేరుతో మరో బూటకపు కథను సృష్టించారని మావోయిస్టులు ఆరోపించారు.
బూటకపు ఎన్కౌంటర్లను వ్యతిరేకిస్తూ నవంబర్ 23ను దేశవ్యాప్త నిరసన దినంగా పాటించాలని ప్రజలకు, ప్రజాసంఘాలకు కేంద్ర కమిటీ పిలుపునిచ్చింది. ప్రజల కోసం పోరాడిన నాయకులను ఇలా హత్య చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని లేఖలో స్పష్టం చేసింది. చరిత్రలో భగత్సింగ్, కొమరం భీం, అల్లూరి సీతారామరాజుల్లా.. హిడ్మా కూడా ప్రజా ఉద్యమాల చరిత్రలో నిలిచిపోయే నాయకుడని కేంద్ర కమిటీ పేర్కొంది. పీడిత ప్రజల కోసం పోరాటం సాగించిన హిడ్మా చరిత్ర భవిష్యత్ తరాలకు స్ఫూర్తి అవుతుందని మావోయిస్టులు చెప్పారు.
హిడ్మా, ఆయన భార్య రాజే, అలాగే ఇటీవల ఎన్కౌంటర్లలో మరణించిన మావోయిస్టులకు కేంద్ర కమిటీ జోహార్లు ప్రకటించింది. వారి ఆశయాలను ముందుకు తీసుకుని ఉద్యమాన్ని కొనసాగిస్తామని శపథం చేస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. ప్రజా హక్కుల కోసం పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని మావోయిస్టులు స్పష్టం చేశారు.
ఆయుధ పోరాటం కొనసాగుతున్న రాష్ట్రాల్లో ఎన్నికల వ్యవస్థపై కూడా కేంద్ర కమిటీ తీవ్ర విమర్శలు చేసింది. ఎన్నికల కమిషన్ అధికార పార్టీ కమిషన్లా మారిపోయిందని, అధికారం చేతుల్లోకి ఎత్తుకున్న నాయకులు… అధికార యంత్రాంగాన్ని గుప్పిట్లో పెట్టుకుని బీహార్ ఎన్నికల్లో మోసం చేసి గెలిచారని ఆరోపించింది. ప్రజాస్వామ్య వ్యవస్థను నాశనం చేసే చర్యలకు వ్యతిరేకంగా ప్రజలు గళమెత్తాలని కేంద్ర కమిటీ పిలుపునిచ్చింది.
Party Letter
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.