
సికింద్రాబాద్లో దారుణ హత్య వెలుగు చూసింది. ఓ వ్యక్తిపై కత్తితో దాడి చేసి అతి కిరాతంగా హత్య చేశారు దుండగులు.. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల ప్రాథమిక వివరాల ప్రకారం.. ముషీరాబాద్కు చెందిన మహ్మద్ నిజాముద్దీన్కు శ్రీనివాస్ కుమారుడు సుమన్తో గతంలో పరిచయం ఉంది. షేర్ మార్కెట్ ట్రేడింగ్, పెట్టుబడుల కోసం సుమన్కు నిజాముద్దీన్ సుమారు రూ.50 నుంచి రూ.60 లక్షల వరకు డబ్బులు ఇచ్చినట్లు తెలుస్తుంది. అయితే కొంతకాలంగా సుమన్ ఆ మొత్తాన్ని తిరిగి ఇవ్వకపోవడంతో పాటు అందుబాటులో లేకపోవడంతో ఇద్దరి మధ్య ఆర్థిక వివాదం ఏర్పడినట్లు తెలుస్తోంది.
అయితే తాను ఇచ్చిన డబ్బులు తిరిగి రాకపోవడంతో నిజాముద్దీన్ గత కొద్ది రోజులు సుమన్ కోసం వెతుకుతున్నట్టు పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో సుమన్ ఇంట్లో లేడని తెలుసుకున్న నిందితుడు.. అతని తండ్రి శ్రీనివాస్ను లక్ష్యంగా చేసుకుని రాత్రి మైలార్గడ్డలోని ఎవర్గ్రీన్ టెంట్ హౌస్ సమీపంలో శ్రీనివాస్పై కత్తితో దాడి చేశాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన శ్రీనివాస్ను గమనించిన స్థానికులు అతన్ని వెంటనే చికిత్స కోసం టీజీఎస్ఆర్టీసీ ఆస్పత్రికి తరలించారు. కానీ హస్పిటల్లో చికిత్ప పొందుతూ శ్రీనివాస్ ప్రాణాలు కోల్పోయారు. దీంతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
ఇక కుటుంబ సభ్యలు ఫిర్యాదుతో చిలకలగూడ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. దాడికి ఉపయోగించిన కత్తి, ఘటనకు సంబంధించిన ఇతర ఆధారాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. నిందితుడు మహ్మద్ నిజాముద్దీన్ కోసం ప్రత్యేక టీమ్ ని ఏర్పాటు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నారు. అయితే కుమారుడితో ఉన్న ఆర్థిక వివాదం కారణంగానే శ్రీనివాస్పై దాడి చేసి హత్య చేశాడా? లేక ఘటన వెనుక మరేదైనా కారణం ఉందా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడి విచారణతో పాటు కుటుంబ సభ్యులు, స్థానికుల నుంచి కూడా పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.