
మహారాష్ట్రలోని అమరావతి జిల్లా పరతవాడలో మహమ్మద్ అయాన్ మహమ్మద్ తన్వీర్ అనే యువకుడు యువతులను ప్రేమ పేరుతో వలలో వేసుకుని బ్లాక్మెయిల్ చేస్తూ లైంగిక దాడులకు పాల్పడ్డాడు. అతని వలపు వలలో చిక్కుకుని దాదాపు 108 మంది అమ్మాయిల జీవితం ప్రశ్నార్థకంగా మారింది. ఇది రాష్ట్రంలోనే కాదు.. దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే ఇక్కడే మరో ట్విస్ట్.. సంచలనం సృష్టిస్తున్న ఈ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో హుజేర్ ఖాన్ ఇక్బాల్ ఖాన్(20 సంవత్సరాలు) అనే యువకుడిని మరో నిందితుడిగా చేర్చారు. ఇప్పటివరకు పోలీసులు ఈ కేసుకు సంబంధించి 18 వీడియోలు, 39 ఫోటోలు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికే ఇందులో బలైపోయిన అమ్మాయిలు 180 మంది అని పోలీసులు చెబుతుండగా.. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశముందని భావిస్తున్నారు. సోషల్ మీడియాలో 350కి పైగా అశ్లీల వీడియోలు వైరల్ అయ్యాయి. ఈ వీడియోల్లో అనేకమంది అమ్మాయిలతో అసభ్యకర దృశ్యాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో మరో దారుణమైన విషయం ఏంటంటే.. ఈ 180 మంది యువతులతో పాటు కొందరు మైనర్ బాలికలు కూడా ఉండి ఉండవచ్చని సమాచారం.
సోషల్ మీడియాలో వీడియోలు పెద్దఎత్తున వైరల్ కావడంతో పోలీసులు ఈ కేసును సవాలుగా తీసుకున్నారు. బాధిత యువతులు చేస్తున్న ఆరోపణల ప్రకారం.. నిందితుడు ముందుగా ప్రేమ పేరుతో యువతులను దగ్గర చేసుకుని, తర్వాత వారితో లైంగిక సంబంధాలు పెట్టుకుని వాటిని రహస్యంగా వీడియోగా చిత్రీకరించేవాడు. అనంతరం ఆ వీడియోలను చూపిస్తూ వారిని బ్లాక్మెయిల్ చేసేవాడు. ఈ వీడియోలను ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్తో పాటు వివిధ సోషల్ మీడియా ప్లాట్ఫారంలలో పెట్టి బెదిరించేవాడు. ఇంతటి దారుణానికి పాల్పడి, ఎందరో అమ్మాయిల జీవితాలను ఇరకాటంలో పెట్టిన మహమ్మద్ అయన్ మహమ్మద్ తన్వీర్ను సోమవారం రాత్రి అమరావతి పోలీసులు అరెస్టు చేశారు. POCSO Act సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మంగళవారం స్థానిక కోర్టులో హాజరుపరిచిన తన్వీర్కు ఏడు రోజుల పోలీసు కస్టడీ విధించారు. అంతేకాకుండా ఈ వీడియోలు ఎలా పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయో తెలుసుకునేందుకు సంబంధిత నెట్వర్క్పై కూడా విచారణ చేపడుతున్నారు.
నిందితుడు తన్వీర్ నుంచి మొబైల్ ఫోన్ మరియు ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులోని సమాచారాన్ని పూర్తిస్థాయిలో సేకరించే ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోంది. అయితే.. నిందితుడు ఇదివరకే కొంత డేటాను తొలగించే అవకాశాలు ఉండవచ్చని పోలీసులు ఆరా తీస్తున్నారు. దీంతో టెక్నాలజీని వినియోగించి నిందితుడు ఒకవేళ డేటాను తొలగించినట్లయితే.. దానిని తిరిగి పొందేందుకు సైబర్ నిపుణుల సహాయం తీసుకుంటున్నారు. ఇప్పటివరకు పోలీసులు స్వాధీనం చేసుకున్న వీడియోల ఆధారంగా ఏడుగురు మైనర్ బాలికల పేర్లు తమ విచారణలో వెలుగులోకి వచ్చాయని పోలీసులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా.. ఇప్పటివరకైతే ఈ కేసులో బాధితులు గానీ, వారి బంధువులు గానీ ఫిర్యాదు చేయడానికి ముందుకు రాలేదు. దీంతో పోలీసులకు మరో అనుమానం మొదలైంది. ఈ నెట్వర్క్ ఇక్కడితోనే ముగియలేదని.. ఈ ఉచ్చులో మరింత మంది అమ్మాయిలు చిక్కుకుని ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. అందుకోసం బాధిత యువతులు ఇంకా ఎవరైనా ఉంటే, ధైర్యంగా ముందుకు వచ్చి అవసరమైన సమాచారం అందించాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఫిర్యాదుదారుల వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని, ఎలాంటి భయాందోళన చెందాల్సిన అవసరం లేదని అమరావతి జిల్లా ఎస్పీ విశాల్ ఆనంద్ వెల్లడించారు.
ఇది చదవండి: హైదరాబాద్లో ఫ్లాట్ లేదా విల్లా కొనేటప్పుడు ఈ 3 తప్పులు మాత్రం అస్సలు చేయకండి..