
ముత్యాలమ్మ దేవతకు ఆనవాయితీగా చెల్లించే మొక్కులను ఓ భక్తుడు వినూత్న రీతిలో సమర్పించి అందరినీ ఆశ్చర్యపరిచిన ఘటన మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలో జరిగింది. బోనాల పండుగ నేపథ్యంలో ఓ భక్తుడు కోడిపుంజుకు కమ్మలు కుట్టించి.. మెడలో లిక్కర్ బాటిల్ తగిలించి డోలు వాయిద్యాల మధ్య ఊరేగింపులో పాల్గొన్నాడు. లిక్కర్ కోడితో మొక్కు చెల్లించుకొని అమ్మ.. సల్లంగా చూడు తల్లి అని మొక్కులు సమర్పించాడు.
వివరాల్లోకి వెళ్తే.. కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలో ఆదివారం ముత్యాలమ్మ బోనాల పండుగ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన తోడేటి వెంకన్న తన మొక్కును వినూత్నంగా చెల్లించుకున్నాడు. కోడిపుంజుకు కమ్మలు కుట్టించి.. మెడలో మద్యం సీసా వేసి.. మేళతాళాల మధ్య ఊరేగింపుగా అమ్మవారి ఆలయానికి బయలుదేరాడు. ఆలయానికి చేరుకున్నాక ప్రదక్షిణలు చేసి ముత్యాలమ్మ తల్లికి ఆ కోడిపుంజుతో మొక్కు చెల్లించుకున్నాడు.
భక్తి, సంప్రదాయానికి వినూత్నతను జోడించిన ఈ దృశ్యం అక్కడికి వచ్చిన భక్తులను ఆకట్టుకుంది. కోడిపుంజుకు కమ్మలు, మెడలో మద్యం సీసాతో ఊరేగింపు సాగడం అక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ముత్యాలమ్మ తల్లి బోనాల వేడుకల్లో చోటుచేసుకున్న ఈ ఘటన ప్రస్తుతం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.\
వీడియో చూడండి..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.