కొణిజేటి రోశయ్య.. ఆయనో మాటల మాంత్రికుడు. అభినవ చాణక్యుడిగా పేరు తెచ్చుకున్నారు. ఆర్థికరంగ నిపుణుడే కాదు.. మాటలతో రాజకీయ ప్రత్యర్థులను చెడుగుడు ఆడుకొనే తీరు ఆయన సొంతం. తన ప్రసంగంతో ప్రతి ఒక్కరినీ మంత్రముగ్ధుల్ని చేసే రోశయ్య.. మాటలతో తూటాలు కూడా పేల్చేవారు. అసెంబ్లీలో ఒంటిచేత్తో ప్రతిపక్షాల్ని హ్యాండిల్ చేసేవారు.
ఇప్పటి రాజకీయాలు వేరు.. వైఎస్ నాటి రాజకీయాలు వేరు. అప్పట్లో రాజకీయంగా హుందాతో కూడిన విమర్శలుండేవి. ఆ హుందాతనానికి నిలువెత్తు నిదర్శనం మాజీ సీఎం రోశయ్య. ఆయన విమర్శలు విలువలతో కూడుకున్నవి. ఆ మాటలు అందరినీ ఆలోచింపజేసేలా ఉండేవి..
వైఎస్ హయాంలో అసెంబ్లీ ఆసక్తికరంగా సాగేది. బలమైన ప్రతిపక్షం ఉండడంతో అధికార, విపక్షాల మధ్య ఢీ అంటే ఢీ అన్నట్టుగా వ్యవహరించేవి. ప్రధాన ప్రతిపక్షం టీడీపీని ఎదుర్కొనేందుకు ఆనాటి సీఎం వైఎస్కు కొండంత అండ రోశయ్యే. సభలో సీఎం వైఎస్ రాజశేఖర్రెడ్డికి రోశయ్య వెన్నుదన్నుగా నిలబడేవారు. ప్రతిపక్షంపై తనదైన సెటైర్లతో విరుచుకుపడేవారు.
ముఖ్యంగా చంద్రబాబుపై చలోక్తులతో పాటు పదునైన విమర్శలు చేసేవారు రోశయ్య. ఓవైపు వైఎస్ రాజశేఖర్రెడ్డి.. మరోవైపు రోశయ్య సభను ముందుండి నడిపేవారు. ప్రతిపక్షం చేసే విమర్శలకు రోశయ్య దీటుగా కౌంటర్ ఇచ్చేవారు. లెక్కలతో సహా విడమర్చి చెప్పేవారు. ప్రతిపక్షంపై పంచులతో తగిన జవాబిచ్చేవారు రోశయ్య.
ప్రతిపక్షంపై విమర్శలు చేయడంలోనే కాదు.. ఆర్థిక రంగంపై అపార అవగాహన రోశయ్య సొంతం. ఆయన బడ్జెట్ ప్రసంగం అవలీలగా సాగేది. ఎక్కడా విసుగు, అలసట కనిపించకుండా ఆయన పద్దు ప్రసంగం సాగిపోయేది.
Also Read..
Bheemla Nayak: భీమ్లానాయక్ నుంచి నాలుగో సింగిల్.. ఆకట్టుకుంటున్న ‘అడవి తల్లి మాట’.. పాట