
ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కిష్టారం గ్రామంలోని అంగన్వాడి కేంద్రంలో ఫుడ్ పాయిజన్ కారణంగా ముగ్గురు చిన్నారులు, ఇద్దరు తల్లులు అస్వస్థతకు గురైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కిష్టారంలోని 3 వ సెంటర్ అంగన్ వాడీ కేంద్రంలో సెప్టెంబర్ 1వ తేదీన చిన్నారులకు అంగన్ వాడీ హెల్పర్ గోంగూర పప్పుతో వండిన అన్నం పెట్టారు. అయితే అంగన్ వాడీ ఆవరణలో ఉన్న గోంగూర చెట్లతో పాటు పూలు పూసే గన్నేరు మొక్కలు కూడా పెంచుతున్నారు. ఈ నేపథ్యంలో 1వ తేదీన గోంగూరతో పాటు గన్నేరు చెట్ల ఆకులను కూడా కోసి గమనించకుండా పప్పు వండటం జరిగింది. ఆ పప్పు అన్నం తిన్న ముగ్గురు చిన్నారులతో పాటు పిల్లలకు అన్నం తినిపిస్తూ రెండు ముద్దలు అన్నం తిన్న ఇద్దరు తల్లులు కూడా అస్వస్థత కు గురైనారు. దీంతో హుటాహుటిన ముగ్గురు చిన్నారులను ఇద్దరు తల్లులను ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
రెండు రోజులుగా ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయంపై అంగన్ వాడీ సత్తుపల్లి CDPO సత్యవతి వివరణ కోరగా.. పిల్లలు, తల్లులు అస్వస్థతకు గురైన మాట వాస్తవమేనని, జిల్లా మెడికల అధికారులతో మాట్లాడి మెరుగైన వైద్యం అందిస్తున్నామన్నారు. ప్రస్తుతం పిల్లలు, తల్లులు ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని ఆమె తెలిపారు.