
ఆరోగ్యమే మహాభాగ్యం అన్న నానుడిని ఆచరణలో చూపిస్తూ పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఫిట్నెస్పై తనకున్న మక్కువను చాటుకున్నారు. ఆదివారం ఉదయం కొల్లాపూర్ శివారులోని తన వ్యవసాయ క్షేత్రంలో ఉన్న బావిలో ఆయన గంటపాటు ఈత కొట్టారు. నిత్యం ప్రభుత్వ, పార్టీ బాధ్యతలతో బిజీగా గడిపే ఆయన ఈ ఆదివారం సొంత నియోజకవర్గంలో సేద తీరారు. మొదటి నుంచి మంత్రి జూపల్లి కృష్ణారావుకు ఆరోగ్యంపై శ్రద్ధ ఎక్కువ. అందుకే 70 ఏళ్ల వయసులోనూ ఎంతో ఆరోగ్యంగా కనిపిస్తారు. ఆయన నమ్మే సిద్ధాంతం సైతం ఆరోగ్యమే మహా భాగ్యం. తను పాటించదడంతో పాటు తన అనుచరులు, పార్టీ కార్యకర్తలను, ప్రజలను పాటించాలని కోరుతుంటారు.
ఆ మధ్య మున్సిపల్ ఎన్నికల్లో సైకిల్ పై ప్రచారం నిర్వహించి వ్యాయామం, ఆరోగ్యంపై ఉన్న శ్రద్ధను ప్రదర్శించారు. పోటీ చేసే అభ్యర్థులు సైతం వాహనాలు వాడకుండా సైకిల్ పై ప్రచారం నిర్వహించాలని సూచించారు. ఇక ఈ మధ్య ప్రతిపక్ష పార్టీలకు సవాల్ విసిరి… రాష్ట్ర రాజకీయాలను షేక్ చేసిన జూపల్లి కృష్ణారావు… ఇవాళ తన వ్యవసాయ బావిలో ప్రశాంతంగా దర్శనమిచ్చారు. సరదాగా గంటపాటు ఒక్కడే ఈత కొట్టి అందరిని ఆశ్చర్యపరిచాడు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మనిషి సంపాదించే సంపద కంటే ఆరోగ్యమే అతిపెద్ద పెట్టుబడి అని పేర్కొన్నారు. వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ దైనందిన జీవితంలో వ్యాయామాన్ని ఒక భాగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
ప్రతిరోజూ కనీసం గంటపాటు యోగ, ధ్యానం, వాకింగ్, జాగింగ్, రన్నింగ్ లేదా స్విమ్మింగ్ వంటి శారీరక శ్రమతో కూడిన పనులు చేయడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుందని ఆయన సూచించారు. వ్యాయామం కేవలం శరీర దారుఢ్యానికే కాకుండా, ఒత్తిడిని దూరం చేసి మానసిక ఉల్లాసాన్ని అందించడంలో కీలక పాత్ర పోషిస్తుందని ఆయన చెప్పారు. యువత నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరూ ఫిట్నెస్పై దృష్టి సారించినప్పుడే ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని మంత్రి జూపల్లి స్పష్టం చేశారు. చురుకైన జీవనశైలిని అలవర్చుకోవడం ద్వారా దీర్ఘకాలిక వ్యాధులకు దూరంగా ఉండవచ్చని, అందరూ ఆరోగ్యకరమైన అలవాట్లను ప్రోత్సహించాలని ఆయన కోరారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి