Uppal: ఉప్పల్‌ తండ్రీకొడుకుల హత్య కేసులో కీలక మలుపు! తండ్రి హత్యకు కుట్ర..కొడుకు అడ్డురావడంతో 27 కత్తిపోట్లు..

|

Oct 17, 2022 | 9:23 AM

ఉప్పల్‌లో స్థానికంగా కలకలంరేపిన తండ్రీకొడుకుల జంట హత్య కేసు దర్యాప్తులో పోలీసులు కీలక సమాచారం సేకరించారు. పథకం ప్రకారం సుపారీ గ్యాంగ్‌తో ఈ హత్యలు చేయించినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు..

Uppal: ఉప్పల్‌ తండ్రీకొడుకుల హత్య కేసులో కీలక మలుపు! తండ్రి హత్యకు కుట్ర..కొడుకు అడ్డురావడంతో 27 కత్తిపోట్లు..
Father and son hacked to death at Uppal
Follow us on

ఉప్పల్‌లో స్థానికంగా కలకలంరేపిన తండ్రీకొడుకుల జంట హత్య కేసు దర్యాప్తులో పోలీసులు కీలక సమాచారం సేకరించారు. పథకం ప్రకారం సుపారీ గ్యాంగ్‌తో ఈ హత్యలు చేయించినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఆస్తి వివాదాల కారణంగా బంధువులే తండ్రీకుమారులైన నరసింహమూర్తి, శ్రీనివాస్‌లను హత్య చేయించినట్లు సమాచారం. ఐతే ఈ హత్య ఉదంతంలో బంధువులు కూడా పాల్గొన్నారా లేదా అనేది ఇంకా నిర్ధారణకాలేదు. ప్రస్తుతం దీనిపై దర్యాప్తు జరుగుతోందని పోలీసులు తెలిపారు. ప్రధాన నిందితుడు విశాఖపట్నం పారిపోయాడు. ఐతే అతని సెల్‌ఫోన్‌ సిగ్నల్‌ ఆధారంగా ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నారు.

ఇద్దరు నిందితులు ఇంటి లోపలికి ప్రవేశించి దారుణంగా తండ్రీ కొడుకులిద్దర్నీ హత్య చేశారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఇప్పలికే కొందర్ని అదుపులోకి తీసుకున్నారు. శ్రీనివాస్‌ మృతదేహంపై దాదాపు 27 కత్తిపోట్లు ఉన్నట్లు పోస్టుమార్టంలో గుర్తించారు. శ్రీనివాస్‌ తండ్రైన నరసింహమూర్తిని మాత్రమే హత్య చేసేందుకు నిందితులు పథకం పన్నారు. ఇంతలో తండ్రిపై దాడిచేస్తున్న దుండగులను అడ్డుకునే క్రమంలోనే శ్రీనివాస్‌ను కూడా విచక్షణా రహితంగా కత్తితో పొడిచారు. ఆస్తి వివాదాలేకాకుండా, క్షుద్ర పూజల నేపథ్యంలో హత్య జరిగిందా అనే కోణంలోనూ దర్యాప్తు జరుగుతోంది. మొత్తం 12 పోలీస్‌ టీంలను ఏర్పాటు చేసి నిందితుల కోసం గాలిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

మృతుల ఇంటి ఎదురుగా ఉన్న హాస్టల్‌లో కొందరు వ్యక్తులు మాస్కులు ధరించి ఉన్నట్లు సంఘటన స్థలం సమీపంలోని సీసీ ఫుటేజీ వీడియోల ద్వారా పోలీసులు గుర్తించారు. హత్యలో పాల్గొన్న వ్యక్తులు హాస్టల్‌ నిర్వాహకులతో తెలుగులో మాట్లాడినట్లు దర్యాప్తులో బయటపడింది. దీన్ని బట్టి హంతకులు స్థానికులేనని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోందని, అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఓ అధికారి తెలిపారు.