
లైంగిక వేధింపుల కేసు కస్టడీ విచారణలో ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి నోరు మెదపలేదని తెలుస్తోంది. దీంతో మరోసారి కస్టడీకి కోరుతూ ఉప్పర్పల్లి కోర్టులో పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. విచారణకు కృష్ణారెడ్డి సహకరించలేదని, మరికొన్ని కీలక విషయాలు తెలుసుకునేందుకు నిందితుడిని కస్టడీకి అప్పగించాలని పిటిషన్లో పేర్కొన్నారు. ఇవాళ కోర్టులో ఈ పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం ఉంది. ఉదయ్ కృష్ణారెడ్డి రెండు రోజుల పోలీస్ కస్టడీ పూర్తికాగానే పోలీసులు ఆయనను కోర్టులో హాజరుపరిచారు. ఈ రెండు రోజుల పాటు ఉమెన్ సేఫ్టీ డీసీపీ లావణ్య నాయక్ నేతృత్వంలో ప్రత్యేక బృందం ఉదయ్ కృష్ణారెడ్డిని విచారించింది. అయితే విచారణలో కీలక అంశాలపై పోలీసులు ప్రశ్నలు సంధించినప్పటికీ.. చాలా ప్రశ్నలకు ఉదయ్ కృష్ణారెడ్డి స్పష్టమైన సమాధానాలు ఇవ్వకుండా దాటవేసినట్లు సమాచారం.
కొన్ని ప్రశ్నలకు తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా అంటూ చెప్పాడని.. మరికొన్నింటికి సమాధానం చెప్పేందుకు నిరాకరించినట్లు సమాచారం. ఈ విచారణను హైదరాబాద్ కమిషనర్ వీసీ సజ్జనార్ నేరుగా పర్యవేక్షిస్తున్నారు. కేసులో ఉన్న కీలక అంశాలు, విచారణ పురోగతి, ఇప్పటివరకు లభించిన ఆధారాలపై ఆరా తీసినట్లు తెలుస్తోంది. అర్ధరాత్రి వరకు అత్తాపూర్ పీఎస్లోనే ఉన్న సీపీ సజ్జనార్ .. సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. ఉదయ్ వాడిన మొబైల్ ఫోన్ గురించి.. కుటుంబ సభ్యులను పిలిచి వివరాలు అడిగారు. ఫోన్ వినియోగం, కాల్ డేటాపై కుటుంబ సభ్యుల నుంచి సమాచార సేకరించడంతోపాటు.. కేసు దర్యాప్తులో కీలక అంశాలపై సజ్జనార్ ఫోకస్ పెట్టారు.
మరోవైపు ఈ కేసులో సాంకేతిక ఆధారాల సేకరణపైనా పోలీసులు దృష్టి పెట్టారు. కాల్ డేటా రికార్డులు, మొబైల్ ఫోన్ ఫోరెన్సిక్ విశ్లేషణ, చాట్ హిస్టరీ, సోషల్ మీడియా కమ్యూనికేషన్, లొకేషన్ డేటా, ఇతర డిజిటల్ ఆధారాలను సేకరించి విశ్లేషిస్తున్నట్లు తెలుస్తోంది. పోలీసులు సేకరించిన టెక్నికల్ ఆధారాలు.. తదుపరి విచారణలో ఎలాంటి కొత్త విషయాలను వెలుగులోకి తీసుకొస్తాయన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
మరిన్ని లైఫ్స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..