
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ మాంచి దూకుడుగా ఉంది. గత కొన్నేళ్లుగా భూముల ధరలు ఆకాశాన్ని తాకుతుండగా, రానున్న రోజుల్లో ఇంకా పెరగనున్నాయన్న అంచనాలు వినిపిస్తున్నాయి. భూమి విలువ తగ్గే కాలం ఇక లేదంటున్నారు నిపుణులు. అందుకే చాలా మంది ఏదో ఒక రూపంలోనైనా నగరంలో సొంత స్థలం కలిగి ఉండాలనే ఆలోచనలో ఉన్నారు.
ఇలాంటి సమయంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి గృహ స్థలం కలలుగంటున్న వారికి ఓ మంచి అవకాశం వచ్చింది. రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ ఆధ్వర్యంలో త్వరలోనే ఓపెన్ ప్లాట్ల బహిరంగ వేలం జరగనుంది. ఈ వేలంలో గజం ధర రూ.20,000 నుంచి రూ.30,000 మధ్య ప్రారంభం కానుంది. ఈ వేలం రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోని మూడు ముఖ్య ప్రాంతాల్లో నిర్వహించనున్నారు. రంగారెడ్డి జిల్లాలోని తోర్రూర్, కుర్మల్గూడ, మేడ్చల్లోని బహదూర్పల్లి వెంచర్లలో ఇప్పటికే అభివృద్ధి చేసిన ప్లాట్లను వేలం వేయడానికి సిద్ధమవుతున్నారు.
నవంబర్ 17, 18 తేదీల్లో వేలం జరగనుంది. నవంబర్ 15 సాయంత్రం 5 గంటల వరకు ఈఎండీ చెల్లింపుకు అవకాశం ఉంది. ఈ వేలంలో మొత్తం 163 ప్లాట్లు విక్రయానికి వస్తున్నాయి. తొర్రూర్: 125 ప్లాట్లు, కుర్మల్గూడ: 25 ప్లాట్లు, బహదూర్పల్లి: 13 ప్లాట్లు వేలానికి ఉన్నాయి.
ఆసక్తి గల కొనుగోలుదారులు ప్లాట్ సైజులు, ప్రారంభ ధరలు, వేలం కేంద్రం వంటి వివరాలను తెలుసుకోవాలంటే www.swagruha.telangana.gov.in వెబ్సైట్ సందర్శించవచ్చు. లేదా బహదూర్పల్లి – 7993455802, తొర్రూర్ – 8121022230 / 9959053583, కుర్మల్గూడ – 7993455784 నంబర్లను సంప్రదించవచ్చు.
మరిన్ని తెలంగాణ వార్తలు