
వాయు కాలుష్యం హైదరాబాద్ను భయపెడుతోంది. మితిమీరిన కాలుష్యం నగరంలో విషాన్ని నింపుతోంది. శ్వాస తీసుకుంటే చాలు ఆయువు మూడే ప్రమాదం ముంచుకొస్తుంది. ధూళి, సీసం తరహా సూక్ష్మ కణాలు ఊపిరితిత్తుల్లోకి చేరి తూట్లు పొడుస్తున్నాయి. వాయు కాలుష్యం విజృంభించడానికి వాహనాలు, చెత్త కాల్చడం, నిర్మాణ రంగాల వ్యర్ధాలు కారణమని పర్యావరణవేత్తలు అంటున్నారు. వాయు కాలుష్యం పెరుగుతుండటంతో ప్రజలు శ్వాస కోస వ్యాధులు, క్యాన్సర్ బారిన పడుతున్నారు. దేశవ్యాప్తంగా అసహజ మరణాలకు ఐదో అతిపెద్ద కారణం వాయు కాలుష్యం.
పర్యావరణ నిపుణుల ఆందోళన..
గత ఐదేళ్లుగా హైదరాబాదులో గాలి కాలుష్యం విపరీతంగా పెరుగుతోంది. నగర శివారు ప్రాంతాల్లో సైతం కాలుష్యం తీవ్రత ఎక్కువగా ఉంది. హైదరాబాదులో చాలాచోట్ల ఎయిర్ క్వాలిటీ మోనిటరింగ్ పరికరాలు అందుబాటులో లేవు. డేంజర్ బెల్ మోగిస్తున్న బెంజిన్ వాయువు గాలిలో ఎంత శాతం ఉందో ఇంతవరకు మానిటరింగ్ చేయలేదు. బెంజిన్ క్యాన్సర్ కారకం అని తెలిసి ఇదివరకు పెట్రోల్లో తీసివేశారు. డీజిల్లో తీసివేయాలని ఎప్పటినుంచో డిమాండ్ ఉంది. రిఫైనరీ స్థాయిలో బెంజిన్ను తీసివేయాలి. హైదరాబాదులో యూనిఫైడ్ మెట్రోపాలిటన్ ట్రాన్సిట్ అథారిటీ ద్వారా రవాణా రంగం నుంచి వచ్చే కాలుష్య నియంత్రణకు సూచనలు జారీ చేయాలి. మొట్టమొదట హైదరాబాదులో ఏర్పడిన యూనిఫైడ్ మెట్రోపాలిటన్ ట్రాన్సిట్ అథారిటీ 10 ఏళ్లలో ఒక్క సమావేశం కూడా నిర్వహించలేదు..
పీఎం 10 ధూళికణాలు, పీఎం 2.5 ధూళికణాలు చిన్న సూక్ష్మ రేణువులు గాలిలో అధికంగా ఉంటాయి. ఊపిరితిత్తుల్లోకి వెళ్లిన తర్వాత అక్కడ స్ట్రక్ అయ్యి గాలి ప్రసరణను అడ్డుకుంటాయి. ఎలర్జిక్ డిసీజెస్ ఆస్తమా, ఎలర్జిక్ రైనాయిటీస్ జబ్బుల బారిన పడే అవకాశం ఉంటుంది. గాలిలో నైట్రోజన్ డయాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డయాక్సైడ్, వాయువులు పీల్చడంతో ఊపిరితిత్తులు దెబ్బతింటాయి. దీర్ఘకాలికంగా ఇటువంటి గాలి పీల్చే వారికి లంగ్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం వాయు కాలుష్యం నియంత్రణకు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.