
న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా మద్యం ఏలురై పారుతూ ఉంటుంది. పార్టీలు, ఈవెంట్లు, పబ్లు, క్లబులు, బార్లు పర్మిట్ రూముల్లో మందు తాగుతూ మందుబాబులు సందడి చేస్తూ ఉంటారు. ఫ్రెండ్స్తో మద్యం తాగుతూ న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. డిసెంబర్ 31న అర్ధరాత్రి వరకు తాగుతూ చిల్ అవుతూ ఉంటారు. దీంతో డిసెంబర్ 31న రాత్రి నుంచి జనవరి 1న ఉదయం వరకు పోలీసులు డ్రంకెన్ డ్రైవ్ టెస్టులు ఎక్కడికక్కడ నిర్వహిస్తూ ఉంటారు. పట్టుబడినవారికి జరిమానా విధించడంతో పాటు కేసులు నమోదు చేయనున్నారు. ఈ క్రమంలో డ్రంకెన్ డ్రైవ్ చేయవద్దని పోలీసులు మందుబాబులను హెచ్చరిస్తున్నారు.
ఈ క్రమంలో డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకుండా ఉచిత ప్రయాణ సేవలను తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్ఫారం వర్కర్స్ యూనియన్ ప్రకటించింది. ఉచిత రైట్స్ సేవలు డిసెంబర్ 31 రాత్రి 11 గంటల నుండి జనవరి ఒకటి రాత్రి ఒంటిగంట వరకు అందించనున్నట్లు వెల్లడించింది. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉచిత రైడ్ సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపింది. రోడ్డు ప్రమాదాలను నివరించి ప్రాణాలను కాపాడాలని లక్ష్యంతో ఉచిత క్యాబ్ సేవలను అందించనున్నట్లు స్పష్టం చేసింది. క్యాబ్, ఆటో, ఈవీ బైక్ కలిపి మొత్తం 500 వాహనాలను ఇందుకు వినియోగిస్తున్నట్లు తెలిపింది. ఫ్రీ రైడ్ కావాలనుకునేవారు 8977009804 నెంబరకు కాల్ చేసి సేవలను పొందవచ్చని తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్ఫారం వర్కర్స్ యూనియన్ పేర్కొంది.
కొత్త ఏడాది వేళ నగరంలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు పలు గైడ్ లైన్స్ జారీ చేశారు. మద్యం తాగినవారికి రెస్టారెంట్స్, బార్, ఈవెంట్ల యజమానుల క్యాబ్ సర్వీస్ కల్పించాల్సి ఉంటుంది. డ్రైవర్ను కేటాయించాల్సి ఉంటుంది. ఇక మద్యం తాగి రోడ్లపై హల్ చల్ చేసేవారిపై కఠిన చర్యలు తీసుకోనున్నారు. అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు విస్తృతంగా నిర్వహించనున్నారు. పట్టుబడినవారి వెహికల్ను సీజ్ చేయడంతో పాటు డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయనున్నారు. ప్రజలు ప్రశాంత వాతావరణంలో న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోవాలని సూచించారు.