
Hydra Commissioner Ranganath: హైదరాబాద్లోని గచ్చిబౌలిలోని అంజయ్య నగర్ ప్రాంతంలో శనివారం మధ్యాహ్నం కేవలం 50 గజాల స్థలంలో నిర్మిస్తున్న ఏడంతస్తుల భవనం కుప్పకూలిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, కొందరు గాయపడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు, అధికారులు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అయితే ఈ సహాయక చర్యలను హైడ్రా అధికారులు పరిశీలిస్తున్నారు. ఘటన స్థలానికి హైడ్రా కమిషనర్ రంగనాథ్ చేరుకుని పరిశీలించారు. ఘటనపై ఆరా తీశారు. బిల్డింగ్ నిర్మాణంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రమాదంలో ఇద్దరు కార్మికులు చనిపోయారని, భవనాన్ని 50 గజాల్లో నిర్మించినట్లు చెప్పారు. అలాగే బిల్డింగ్ చుట్టు మొత్తం హాస్టల్స్ ఉన్నాయని, బిల్డింగ్ నిర్మాణంలో అడుగడుగునా నిబంధనల ఉల్లంఘన కనిపిస్తోందన్నారు.
సాజిద్ బిల్డింగ్స్ నిర్మించి విక్రయిస్తున్నట్లు గుర్తించామని రంగనాథ్ అన్నారు. పక్కనున్న అక్రమ భవనాలను అన్నింటిని తొలగిస్తామన్నారు. 50 గజాలలో నిర్మించిన భవనం కేవలం రెండు నెలల్లోనే నిర్మాణం పూర్తయ్యిందని, అధికారులు ఎక్కడ అడ్డుపడతారోనని వేగంగా నిర్మాణం సాగించారన్నారు. అంజయ్యనగర్లోని అక్రమంగా నిర్మించిన భవనాలన్ని తొలగిస్తామన్నారు. ఎవ్వరిని ఉపేక్షించమన్నారు. అయితే నిర్మాణం పూర్తి కాకముందే భవనం కుప్పకూలింది. ప్రస్తుతం బిల్డర్ పరారీలో ఉన్నాడని తెలిపారు.