
హైదరాబాద్ ప్రజలకు బిగ్ అలర్ట్. నగర ట్రాఫిక్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. కేబీఆర్ పార్క్ వద్ద ట్రాఫిక్ ఆంక్షలను అమల్లోకి తీసుకురానున్నట్లు స్పష్టం చేశారు. ఈ నెల 18వ తేదీ నుంచి వన్ వే ట్రాఫిక్ విధానాన్ని అమలు చేయనున్నట్లు తెలిపారు. ఇక్కడ ఫ్లైఓవర్, బహుళ అంతస్తుల నిర్మాణ పనులు జరుగుతున్న క్రమంలో ట్రాఫిక్ పోలీసులు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. సులభంగా ట్రాఫిక్ కొనసాగడం, పనులు వేగవంతంగా పూర్తి కావడం కోసం అధ్యయనాలు, ట్రయల్స్ కోసం ఈ ఆంక్షలను అమలు చేయనున్నట్లు చెప్పారు. వాహనదారాలు, ప్రజలు దీనిని గమనించి సహకరించాలని కోరారు.
అయితే ఇంతకముందే కేబీఆర్ పార్క్ వద్ద వన్ వే విధానంపై ట్రయల్ రన్ నిర్వహించారు. ట్రాఫిక్ సరళిని పరిశీలించడంతో పాటు స్థానిక ప్రజలు, వాకర్స్, నివాసి సంక్షేమ సంఘాలతో సంప్రదింపులు జరిపారు. అనంతరం సమగ్రంగా అధ్యయనం చేయడం, రెండు విడతలుగా ట్రయల్ రన్, జీహెచ్ఎంసీ సమన్వయం తర్వాత ట్రాఫిక్ ఆంక్షలను అమలు చేస్తున్నారు. వాహనదారుల రాకపోకలకు ఇబ్బంది కలగకుండా ఉండటంతో పాటు పనులు వేగవంతంగా పూర్తయ్యేలా వీలు కల్పించేందుకు ఈ తాత్కాలిక ఆంక్షలను విధించినట్లు చెప్పారు. బహుళ అంతస్తుల నిర్మాణాలు పూర్తయిన తర్వాత కేబీఆర్ పార్క్ ప్రవేశ ద్వారం, రోడ్ నెం 45, ఫిల్మ్ నగర్, మహారాజా అగర్సేన్, బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ సిగ్నల్స్ వద్ద రద్దీని తగ్గించి సిగ్నల్ ఫ్రీ జర్నీని ప్రవేశపెడతారు. దీని వల్ల జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ వద్ద ట్రాఫిక్ భారీగా తగ్గుతుంది.
కొత్త ఫ్లైఓవర్ల రాకతో ఐటీ కారిడార్కు ప్రయాణ సమయం తగ్గనుండగా.. వాహనదారులు సిగ్నల్స్ వద్ద వేచి ఉండే పని ఉండదు. దీని వల్ల కేబీఆర్ పార్క్ వద్ద పొల్యూషన్ కూడా తగ్గే అవకాశముంటుందని చెబుతున్నారు. నిర్మాణ పనుల వల్ల మొదట్లో వాహనదారులకు కాస్త ఇబ్బంది కలిగినప్పటీ.. పూర్తైన తర్వాత ట్రాఫిక్ ఇబ్బందులు తగ్గుతాయి. వీలైనంత త్వరగా పనులు పూర్తయ్యేలా హెచ్ఎండీఏ చర్యలు చేపడుతుంది. ఈ సమయంలో ట్రాఫిక్ పోలీసులకు ప్రజలకు పూర్తి సహకారం అందించాలని అధికారులు చెబుతున్నారు. ఈ సమయంలో రద్దీని తగ్గించేందుకు, అవాంతరాలు లేకుండా రాకపోకలు సాగేలా ట్రాఫిక్ పోలీసులు నిరంతరం సమీక్షిస్తారు. అలాగే అవసరమైన చోట సవరణలు చేస్తారు. వాహనదారులకు మార్గనిర్దేశనం చేయడం, ప్రవాహాన్ని నియంత్రించేందుకు కీలక కూడళ్ల వద్ద సిబ్బంది మోహరిస్తారు. దీంతో ప్రజలు దీనికి సహకరించాలని ట్రాఫిక్ పోలీసులు కోరుతున్నారు.